Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక

విండోస్, మ్యాక్, లైనక్స్ యూజర్లు వెంటనే క్రోమ్ అప్‌డేట్ చేసుకోవాలని సూచన;

Update: 2025-05-20 04:30 GMT

కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లలో గూగుల్‌ క్రోమ్‌ వాడుతున్న యూజర్లకు కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సెర్ట్‌-ఇన్‌ (CERT-In) గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో  తీవ్రమైన భద్రతా లోపాలను గుర్తించింది. లోపాలను ఆసరా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు విలువైన డేటాను తస్కరించేందుకు అవకాశం ఉందని హెచ్చరించింది. తప్పనిసరిగా అందరూ గూగుల్‌ క్రోమ్‌ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. విండోస్‌, మ్యాక్‌ ఓఎస్‌, లినక్స్‌ యూజర్లకు ప్రత్యేకంగా హెచ్చరికలు చేసింది.

ప్రస్తుతం మొబైల్‌ యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొంది. సైబర్‌ దాడుల నుంచి తప్పించుకునేందుకు పాత వెర్షన్‌ వాడుతున్న వారంతా కొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ కావాలని కేంద్ర ప్రభుత్వంలోని ఈ ఏజెన్సీ పేర్కొంది. విండోస్‌ ఓఎస్‌లో గూగుల్‌ క్రోమ్‌ 136.0.7103.113/.114 కంటే పాత వెర్షన్స్‌, లినక్స్‌, మ్యాక్‌ ఓఎస్‌ 136.0.7103.113 కంటే పాత వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. బ్రౌజర్ లోడర్, మోజో ఇంటర్‌ ప్రాసెస్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌లోని లోపాల కారణంగా సమస్యలు వస్తాయని తెలిపింది. రిమోట్‌ హ్యాకర్‌ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేసేలా యూజర్లను పురిగొల్పవచ్చని సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది.

లింక్‌పై క్లిక్‌ చేస్తే క్రోమ్‌లోని లోపాలను ఆసరా చేసుకొని మాల్వేర్‌, ఇతర కోడ్‌ని సిస్టమ్‌లోకి చొప్పించి.. మొత్తం కంప్యూటర్‌ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఇదే జరిగితే సిస్టమ్‌లోని డేటా అంతా లీక్‌ అయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. సైబర్‌ నేరగాళ్ల బారినపడకుండా ఉండేందుకు తప్పనిసరిగా అందరూ తమ గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. అప్‌డేట్‌ చేసుకునేందుకు క్రోమ్‌ బ్రౌజర్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. ఎబౌట్‌ క్రోమ్‌పై క్లిక్‌ చేస్తే ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ అవుతుంది.

Tags:    

Similar News