chandipura virus: 'చాందీపురా' వైరస్తో మరో నాలుగేళ్ల బాలిక మృతి
29 మందికి వైరస్ , 14 కి చేరిన మృతులు;
గుజరాత్లో చాందీపురా వైరస్ సోకడం వల్ల నాలుగేళ్ల బాలిక మృతి చెందిందని రాష్ట్ర అధికారులు నిర్ధారించారు. ఆ వైరస్ కారణంగా నమోదైన తొలి మరణం ఇదేనని వెల్లడించారు. నాలుగేళ్ల బాలక నమూనాలను పరీక్షించిన పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్ఐవీ) ఆమెకు వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు. ఇప్పటి వరకు గుజరాత్లో 29 మందికి చాందీపురా వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. అయితే వారిలో 14 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. వారి నమూనాలు ఎన్ఐవీకి పంపినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
వైద్యుల సమాచారం ప్రకారం.. గుజరాత్లో విధ్వంసం సృష్టిస్తున్న చండీపురా వైరస్ మొదట ఫ్లూ వంటి జ్వరానికి కారణమవుతుంది. మూర్ఛ, వాంతులు, వికారం వంటి సమస్యలతో అపస్మారక స్థితి లోకి వెళ్ళిపోతారు. పిల్లల మెదడు వాచిపోతుంది. దీనినే ఇన్సెఫలైటిస్ అంటారు. రోజురోజుకి బాధితుల పరిస్థితి దిగజారుతుంది. 1966 సంవత్సరంలో మహారాష్ట్రలోని నాగ్పూర్లోని చాందీపూర్ గ్రామంలో ఇదే వైరస్ కారణంగా 15 ఏళ్లలోపు పిల్లలు చనిపోయారని భావిస్తున్నారు. అప్పటి నుంచి ఈ వైరస్కు చండీపురా వైరస్ అని పేరు పెట్టారు.
ఇప్పుడు ఈ వైరస్ గుజరాత్లోని పలు జిల్లాలకు వ్యాపించింది. చండీపురా వైరస్ వ్యాప్తికి దోమలు, ఈగలు మరియు రెక్కపురుగులు వంటి కీటకాలు కారణమని భావిస్తున్నారు. ఈ వైరస్ ప్రధానంగా 2-16 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలకు సోకుతుంది. ఈ వ్యాధి సోకితే కనిపెట్టడానికి చాలా సమయం పడుతుంది. అలాగే 55-75 శాతం మధ్య మరణాలు సంభవించే అవకాశం కూడా ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. నివారణ చర్యలకు ఉపక్రమించింది.