పొక్సో కేసులో బ్రిజ్ భూషణ్ కు రిలీఫ్
ఆధారాలు లేవని ఛార్జ్ షీట్ కొట్టేసిన పోలీసులు;
మైనర్ను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించిన కేసులో ఆధారాలు లేవని ఢిల్లీ పోలీసులు తమ ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ మేరకు వెయ్యి పేజీల ఛార్జిషీట్ ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో సమర్పించారు. తమను లైంగికంగా వేధించినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై రెజ్లర్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు తమ రిపోర్టును రిలీజ్ చేశారు. మైనర్ రెజ్లర్ చేసిన ఆరోఫణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.
బ్రిజ్ భూషణ్పై ఢిల్లీ పోలీసులు గురువారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఏప్రిల్లో పోక్సో చట్టం కింద బ్రిజ్ భూషణ్పై ఓ మైనర్ అథ్లెట్ కేసు దాఖలు చేసింది. కానీ ఇప్పుడు బ్రిజ్పై ఇచ్చిన స్టేట్మెంట్ను ఆ మైనర్ వెనక్కి తీసుకున్నట్లు పోలీసుల రిపోర్టు ద్వారా తెలుస్తోంది. తనను ఎంపిక చేయకపోవడం పట్ల ఆగ్రహంతోనే ఇలాంటి కేసును చీఫ్పై ఫైల్ చేసినట్లు ఆ మైనర్ అథ్లెట్ వెల్లడించింది. చాలా కఠినంగా టోర్నీల కోసం వర్క్ చేశానని, కానీ తనను సెలెక్ట్ చేయలేదని, దాని వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయానని, ఆ కోపంతో బ్రిజ్పై లైంగిక వేధింపుల కేసు పెట్టినట్లు ఆ మైనర్ రెజ్లర్ పేర్కొన్నది.
అయితే ఏ ఆధారాలు లేని కారణంగా...ఈ కేసుని రద్దు చేయాలని నివేదికలో పేర్కొన్నారు ఢిల్లీ పోలీసులు. అయితే..ఈ రిపోర్ట్పై కోర్టు విచారణను వాయిదా వేసింది. జులై 4వ తేదీన విచారిస్తామని వెల్లడించింది. ఇదే నివేదికలో మైనర్ ఇచ్చిన స్టేట్మెంట్నీ చేర్చారు పోలీసులు. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసు రద్దు చేయాలని కోరుతున్నట్టు అందులో పేర్కొన్నారు. మైనర్ రెజ్లర్ తండ్రి ఇటీవలే మీడియాతో మాట్లాడారు.
తన కూతురుని బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించలేదని, కానీ కావాలనే తనపై కుట్ర చేసి ఆడకుండా చేశాడని ఆరోపించారు. ఇదే సమయంలో పోలీసులు ఆయనపై పోక్సో కేసు రద్దు చేయాలని కోరడం కీలకంగా మారింది. కాగా..ఇటీవల తనను కలుసుకున్న రెజ్లర్లకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కొన్ని హామీలు ఇవ్వగా వాటిలో చార్జిషీట్ దాఖలు ఒకటి. అదే విధంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఎన్నికలు జులై 6న నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వ ప్రకటించింది.