Sophia Qureshi: అంతా 25 నిమిషాల్లోనే, ఉగ్రవాదుల శిక్షణా శిబిరంపై విరుచుకుపడిందిలా
మీడియా సమావేశంలో ఇద్దరు మహిళా ఆఫీసర్లు.. వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషి?;
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఆపరేషన్ సిందూర్ గురించి భారత సర్కారు మీడియాకు వెల్లడించింది. ఆ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రితో పాటు మహిళా ఆఫీసర్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి పాల్గొన్నారు.
ఇద్దరు మహిళా ఆఫీసర్లతో మీడియా సమావేశాన్ని నిర్వహించి మహిళా శక్తిని ఇండియా చాటింది. ఆపరేషన్కు సిందూర్ అని పేరు పెట్టడంలో నిగూఢ అర్థం దాగి ఉన్నది. పెహల్గామ్ ఉగ్రదాడిలో భర్తలు కోల్పోయిన మహిళలు తమ సిందూరాన్ని కోల్పోయారు. ఆ మహిళలను గౌరవిస్తున్న రీతిలో సిందూర్ అనే పేరు పెట్టారు.
విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేశామని, ఆ ఉగ్రవాదులు సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడ్డారని, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేయలేదని కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు. మొత్తం 9 ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ.. ప్రతిదాడి అంశంలో భారత్ నిగ్రహాన్ని ప్రదర్శించిందని, పాకిస్థాన్ కవ్వింపు చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తం అయి ఉన్నామని తెలిపారు. వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్.. భారతీయ వైమానిక దళంలో హెలికాప్టర్ పైలెట్. నేషనల్ క్యాడెట్ కార్ప్స్లో ఆమె చేశారు. ఇంజినీరింగ్ చదివారు. 2019, డిసెంబర్ 18వ తేదీన ఫ్లయింగ్ బ్రాంచ్లో పర్మనెంట్ కమిషన్లో చేరారు.
కల్నల్ సోఫియా ఖురేషి.. ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్లో ఉన్నత అధికారి. భారతీయ సైన్యంలో ఓ ఆర్మీ కాంటింజెంట్కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళా ఆఫీసర్గా ఉన్నారు.