DELIMITATION: దక్షిణాది రాష్ట్రాల్లో టెన్షన్.. టెన్షన్
తమిళనాడులో కీలక భేటీకి రంగం సిద్ధం;
దక్షిణాది రాష్ట్రాలను నియోజకవర్గాల పునర్విభజన టెన్షన్ వెంటాడుతోంది. 2026 నాటికి రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ వల్ల.. దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గిపోతుందని.. నిధుల కేటాయింపులో కూడా తేడాలు వస్తాయని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై... కేంద్రం కత్తి వేలాడుతోందని తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
తమిళనాడులో మార్చి 5 కీలక భేటీ
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయమై మార్చి 5న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన విషయమై తమిళనాడు అతిపెద్ద హక్కు పోరాటం నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మార్చి 5న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని... 40 పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయించామని తెలిపారు.
తిరుగుబాటు తప్పదు: రేవంత్ రెడ్డి
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా లెక్కల ప్రాతిపదికన.. దక్షిణాదిలో లోక్ సభ సీట్లు తగ్గిస్తే అది తీవ్ర సంక్షోభానికి, తిరుగుబాటుకు దారితీస్తుందని రేవంత్ హెచ్చరించారు. ఎంపీ సీట్ల తగ్గుదలను అసలు అంగీకరించే ప్రశ్నే లేదని.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే సహించేది లేదని తెల్చి చెప్పారు. దక్షిణాదిని రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు.