Tejas Mark-1A jets : రేపటితో ముగియనున్న మిగ్-21 శకం..
97 తేజస్ మార్క్-1ఏ కొనుగోలుకు నేడు కీలక ఒప్పందం..!
భారత రక్షణ రంగం మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి 'అగ్ని-ప్రైమ్' మధ్యంతర శ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ చారిత్రక ప్రయోగంతో, ఇలాంటి అత్యాధునిక సామర్థ్యం కలిగిన కొన్ని దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం అధికారికంగా ప్రకటించారు.
ఈ కొత్త తరం క్షిపణి దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలదని, దీనిలో పలు అత్యాధునిక సాంకేతికతను పొందుపరిచారని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ రైలు లాంచర్ వ్యవస్థ ద్వారా క్షిపణిని దేశంలోని రైల్వే నెట్వర్క్పై ఎక్కడికైనా అత్యంత వేగంగా తరలించవచ్చు. దీనివల్ల శత్రువుల నిఘాకు చిక్కకుండా, చాలా తక్కువ సమయంలో ప్రయోగానికి సిద్ధం చేసేందుకు వీలు కలుగుతుంది. దేశ రక్షణ సామర్థ్యాన్ని ఇది రెట్టింపు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ అద్భుత విజయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనతను సాధించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), వ్యూహాత్మక బలగాల కమాండ్ (ఎస్ఎఫ్సీ) శాస్త్రవేత్తలతో పాటు సాయుధ బలగాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యంలో భాగంగా రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా ఈ ప్రయోగం ఒక కీలక ముందడుగు అని ఆయన అభివర్ణించారు.