కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య గురువారం నాటికి 296కు చేరింది. చలియార్ నదిలోనే ఇప్పటివరకు 144 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటికీ 240 మంది ఆచూకీ కనిపించడం లేదు. 200 మంది గాయపడి వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. వెయ్యి మందిని సురక్షితంగా కాపాడినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం 82 సహాయక శిబిరాలను ఏర్పాటుచేయగా 8,204 మంది ఆశ్రయం పొందుతున్నారు. కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాల్లో గురువారం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించి బాధితులను పరామర్శించారు.
కొండచరియలు విరిగిపడ్డప్పుడు చూరల్మల, ముండక్కై మధ్య ఉన్న వంతెన కూలిపోవడం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. దీంతో ఆర్మీలోని మద్రాస్ ఇంజినీర్ గ్రూప్ బృందానికి చెందిన 140 మంది ఇక్కడకు చేరుకొని కొత్త వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. 31 గంటల పాటు శ్రమించి 190 అడుగుల బెయిలీ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో ముండక్కైలో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి.
మృతదేహాలకు పోస్ట్మార్టమ్ చేస్తున్న ఓ మహిళా వైద్యురాలి ఆవేదన ఇక్కడి దయనీయ పరిస్థితులను అద్దం పడుతోంది. ‘‘ఎన్నో ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉన్నా. ఎన్నో మృతదేహాలకు పోస్టుమార్టం చేశా. ఇక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఓ శరీరం చూస్తే మొత్తం ఛిద్రమయ్యింది. రెండోదాన్ని చూడలేకపోయా. అది కూడా ఏడాది చిన్నారిది. అటువంటి మృతదేహాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. అందులో అనేకం గుర్తించలేనంతగా ఉండటం కలచివేసింది. ఇక పోస్టుమార్టం చేయలేనని అనుకున్నా. ఆ ప్రాంగణం నుంచి బాధితుల సంరక్షణ కేంద్రానికి పారిపోదామనుకున్నా. కానీ, ప్రత్యామ్నాయం లేదు. అలా మొత్తంగా 18 మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించా’’ అని వయనాడ్ ఘటన ప్రదేశంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్యురాలు భావోద్వేగంతో వివరించారు.