Supreme Court: ఢిల్లీలో వర్చువల్గా కేసుల విచారణ
దేశ రాజధానిలో ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యం..;
వీలైన చోట వర్చువల్ పద్ధతిలో వాదనలు చేపట్టాలని జడ్జీలకు ఆదేశాలు ఇచ్చినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తెలిపారు. కోర్టులన్నీ వర్చువల్ విధానంలో నడిచేట్టుగా సూచనలు చేయాలని కొందరు సీనియర్ న్యాయవాదులు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాను కోరారు. అయితే ఆ అభ్యర్థనలను సుప్రీం చీఫ్ జస్టిస్ తిరస్కరించారు. కోర్టులన్నీ హైబ్రిడ్ మోడల్లోనే పనిచేస్తాయని, అయితే వాళ్లు కావాలనుకుంటే వర్చువల్ విచారణను ఎంపిక చేసుకోవచ్చు అని సీజే సంజీవ్ ఖన్నా తెలిపారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ అభ్యర్థన చేశారు.
దేశ రాజధానిలో ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక సూచనలు చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుండటంతో వీలైతే జడ్జీలు వర్చువల్గా కేసుల విచారణ చేయాలని ఆదేశించారు. కాలుష్య అంశం చేయి దాటిపోయిందని సీనియర్ లాయర్ కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానంలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక, జీఆర్పీఏ-4 పరిమితులను పరిగణనలోకి తీసుకొని ఢిల్లీలోని న్యాయస్థానాలు పూర్తిగా వర్చువల్ విధానాన్ని అనుసరించాలని న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ శంకర నారాయణన్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. దీంతో ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్ మోడ్లో పాల్గొని తమ వాదనలు వినిపించ వచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు.
కాగా, ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతుంది.. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకున్నారు. ఈరోజు (మంగళవారం) సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494కు పడిపోగా.. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్క్ను దాటిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. దీని వల్ల ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. వాయు కాలుష్యంపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఢిల్లీ సర్కార్ పై మండిపడింది. కాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే ఒకటి నుంచి 11వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.