Delhi: ఢిల్లీలో స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు..
విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన;
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది డాగ్స్క్వాడ్స్తో తనిఖీలు చేస్తున్నారు.
స్కూళ్ల అధికారిక మెయిల్స్కి బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూళ్లను పేల్చేస్తున్నట్లుగా మెసేజ్ పంపిస్తున్నారు. దీంతో స్కూళ్ల దగ్గర పెద్ద ఎత్తున టెన్షన్ నెలకొంటోంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసంత్ కుంజ్లోని డీపీఎస్ స్కూల్ (DPS), స్ప్రింగ్ డేల్ స్కూల్తో పాటు మరికొన్ని పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు మెసేజ్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్కూల్ నుంచి పిల్లలను బయటకు పంపి తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు.
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపు మేసేజ్లు రావడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని నెలలుగా ఈ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. డిసెంబర్లో సౌత్ ఢిల్లీలోని ఒక ప్రైవేట్ స్కూల్కు.. ఆ తర్వాత జూన్ 19న సౌత్ ఢిల్లీ లోని మరొక ప్రైవేట్ స్కూల్కు బాంబు బెదిరింపులు వచ్చాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వరుస బాంబు బెదిరింపుల నేపద్యంలో ఇప్పటికే సైబర్ వింగ్ రంగంలోకి దిగింది. మెయిల్స్ ఎక్కడి నుంచి పంపుతున్నారని దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి మెయిన్స్ వస్తున్నట్లు గుర్తించారు.