APP: ఆప్‌కు మంత్రి కైలాష్ గహ్లోత్‌ రాజీనామా

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని మంత్రి రాజీనామా;

Update: 2024-11-17 07:30 GMT

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్‌ఆద్మీ పార్టీ  కి భారీ షాక్‌..! దిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్‌ (Kailash Gahlot) ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్‌  కు లేఖ పంపారు. దిల్లీ ప్రభుత్వం అసంపూర్తి వాగ్దానాలు చేస్తోందని.. రాష్ట్రంలో పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని కైలాష్ గహ్లోత్‌ ఈ లేఖలో ఆరోపించారు. దిల్లీ ప్రజలకు సేవ చేయాలని నిబద్దతతో ఏర్పడిన ఆప్‌ ఆశయాలను ఆ పార్టీ నేతల రాజకీయ ఆశయాలు అధిగమించాయని మండిపడ్డారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖ నేత కైలాష్ గెహ్లాట్ ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. తన రాజీనామాలో… యమునాను శుభ్రపరచడం, కేజ్రీవాల్ బంగ్లా నిర్మాణం అంశాన్ని కూడా లేవనెత్తారు. గత ఎన్నికల్లో యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇచ్చామని, అయితే యమునా నదిని శుభ్రం చేయలేకపోయామని గెహ్లాట్ పేర్కొన్నారు. 

“నయా బంగ్లా లాంటి సిగ్గుమాలిన, విచిత్రమైన వివాదాలు చాలానే ఉన్నాయి. మనం ఇంకా సామాన్యులమని నమ్ముతున్నామా అనే సందేహాన్ని ఇప్పుడు అందరిలో కలుగజేస్తున్నాయన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంపై పోరాటంలో ఎక్కువ సమయం గడిపితే ఢిల్లీకి నిజమైన పురోగతి ఉండదని ఇప్పుడు స్పష్టమైంది. ఆప్ నుంచి విడిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.” అని కైలాష్ గెహ్లాట్ లేఖలో రాసుకొచ్చారు. కేజ్రీవాల్‌కు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. మంచి రాజకీయ ప్రయాణానికి తోడ్పాటును అందించిన తన పార్టీ సహచరులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. కైలాష్ గెహ్లాట్ రాజీనామాను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆమోదించారు.

Tags:    

Similar News