Delhi: తప్పిపోయిన త్రిపుర అమ్మాయి మృతదేహం గుర్తింపు..
యమునా నదిలో మృతదేహం గుర్తింపు!;
ఆరు రోజుల క్రితం తప్పిపోయిన త్రిపురకు చెందిన చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ మృతదేహం లభ్యమైంది. 19 ఏళ్ల ఆమె డెడ్బాడీని దేశ రాజధానిలోని ఓ ఫ్లై ఓవర్ కింద పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. డెడ్బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. స్నేహ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే సూసైట్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థిని స్నేహ దేబ్నాథ్(19) అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ యూనివర్సిటీలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాలకు చెందిన విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ జూలై 7న అదృశ్యమైంది. ఆమె స్వస్థలం త్రిపుర. ఢిల్లీకి వచ్చి చదువుకుంటోంది. మాజీ సైనికుడు, సుబేదార్ మేజర్ (గౌరవ లెఫ్టినెంట్) ప్రీతిష్ దేబ్నాథ్ (రిటైర్డ్) కుమార్తె. ప్రస్తుతం ఆమె మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతోంది. డయాలసిస్ చేయించుకుంటోంది. స్నేహ తప్పిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఆమె జాడ కోసం వెతికారు. 48 గంటల తర్వాత బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు.
జూలై 7న స్నేహితురాలిని సారాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్లో దించేందుకు స్నేహ వెళ్లింది. ఉదయం 6:45 గంటలకు స్నేహితురాలిని దింపబోతున్నట్లు కుటుంబ సభ్యులకు ముందుగానే సమాచారం అందించింది. ఉదయం 5:56 గంటలకు తల్లి ఫోన్ చేసినప్పుడు మాట్లాడింది. తిరిగి ఉదయం 8:45 గంటలకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ అని వచ్చింది. అయితే స్నేహ.. స్నేహితురాలిని కలవలేదని తెలుస్తోంది. క్యాబ్ డ్రైవర్.. రైల్వే స్టేషన్లో దింపడానికి బదులుగా సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గర దింపాడని తెలుస్తోంది. ఇక స్నేహ అదృశ్యంపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా.. ఢిల్లీ అధికారులను సంప్రదించారు. ఆమె జాడను కనుగొనాలని ఢిల్లీ పోలీసులను కోరారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్.. స్నేహ కోసం గాలించింది. చివరకు మృతదేహంగా లభ్యమైంది.