IndiGo flight: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపులు..
ప్రయాణికులు క్షేమం;
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం 5.35 గంటలకు ఇండిగో 6ఈ2211 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి బయల్దేరాల్సి ఉన్నది. అయితే టేకాఫ్కు సిద్ధమవుతుండగా బాత్రూమ్లో ఓ టిష్యూ పేపర్పై బాంబు అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా కిందికి దించేశారు. అనంతరం ఎయిర్పోర్టు అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కాగా, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఉదయం 5.35 గంటలకు విమానంలో బాంబు ఉందన్న సమాచారం తమకు అందిందని, వెంటనే క్విక్ రియాక్షన్ టీమ్ విమానం వద్దకు చేరుకున్నదని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా కిందికి దించేశామని వెల్లడించారు. విమానాన్ని నిర్మాణుష్య ప్రదేశానికి తరలించారని, ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులు, బాంబు డిస్పోజల్ టీం క్షుణ్ణంగా తనిఖిచేస్తున్నదని ఎయిర్పోర్టు అధికారులు చెప్పారు.