Dolo 650: డోలో-650 అమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. రూ.1000 కోట్ల ఖర్చుతో..
Dolo 650: జనం రోగాలపై మందుల కంపెనీలు కోట్లు కూడబెట్టుకుంటున్నాయి.. ఇందుకు ఉదాహరణే డోలో 650.;
Dolo 650: జనం రోగాలపై మందుల కంపెనీలు కోట్లు కూడబెట్టుకుంటున్నాయి.. ఇందుకు ఉదాహరణే డోలో 650.. ఈ ట్యాబ్లెట్ను సూచించడం కోసం డాక్టర్లకు వెయ్యి కోట్ల విలువైన గిఫ్టులు అందాయన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.. దీనిపై సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. వైద్యులు తమ మందులను ప్రిస్క్రయిబ్ చేసేందుకు ఫ్రీబీస్ ఇస్తున్నారని, ఈ వ్యవహారంలో ఫార్మా కంపెనీలను బాధ్యులను చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది అపర్ణా భట్ ఈ పిటిషన్ దాఖలు చేశారు..
దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇది తీవ్రమైన సమస్య అని, కోవిడ్ సమయంలో తనకు కూడా అదే ట్యాబ్లెట్ సూచించారని కేసు విచారిస్తున్న బెంచ్లోని న్యాయమూర్తి డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.. డోలో 650.. కరోనా టైమ్లో ఈ ట్యాబ్లెట్కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు..
తుమ్మినా, దగ్గినా, కొంచెం జ్వరం వచ్చినట్టు అనిపించినా డోలో 650 కోసం మెడికల్ షాపులకు జనం పరుగులు పెట్టేవారు.. ఇప్పుడు కూడా డోలో 650కి డిమాండ్ భారీగానే ఉంది.. అయితే, ఈ డిమాండ్ వెనుక ఒక పెద్ద స్కామ్ జరిగినట్లుగా బయటపడుతోంది. ఈ ట్యాబ్లెట్ను ప్రిస్క్రయిబ్ చేయడం కోసం డాక్టర్లకు వెయ్యి కోట్ల విలువైన గిఫ్ట్లను అందించినట్లుగా సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది.. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ తరపు సీనియర్ న్యాయవాది ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇటీవల డోలో 650 డ్రగ్ తయారు చేస్తున్న మైక్రోల్యాబ్స్ సంస్థపై ఐటీ దాడులు జరిగాయి.. ఈ కంపెనీకి సంబంధించిన 36 కేంద్రాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.. ఆ విచారణలోనే ఈ స్కామ్ బయటపడినట్లుగా తెలుస్తోంది.. వెయ్యి కోట్ల విలువ చేసే గిఫ్టులను డాక్టర్లకు, మెడికల్ ప్రొఫెషనల్స్కు పంచినట్లుగా ఐటీ అధికారుల విచారణలో బయటికొచ్చినట్లు సమాచారం.. ఇది చాలా తీవ్రమైన నేరమని, తమ ప్రొడక్ట్ను అమ్ముకోవడానికి వైద్యులకు లంచాలు ఇచ్చి ప్రిస్క్రయిబ్ చేయించడం దారుణమైన చర్య అని పలువురు ఫైరవుతున్నారు.