Donald Trump: హమాస్కు ట్రంప్ చివరి వార్నింగ్
వెంటనే బందీలను విడుదల చేయాలని హెచ్చరిక;
బందీల విడుదలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ గ్రూప్కు మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ చెరలో ఉన్న మిగిలిన బందీలను వెంటనే విడుదల చేయాలన్నారు. లేదంటే హమాస్ అంతు చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే తన చివరి హెచ్చరిక అని పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో పోస్టు పెట్టారు.
‘మీ చెరలో ఉన్న బందీలందరినీ వెంటనే విడుదల చేయండి. అలాగే మీరు హత్య చేసిన వ్యక్తుల మృతదేహాలను తిరిగి అప్పగించండి. లేదంటే మీ అంతు చూస్తా. అందుకు ఇజ్రాయెల్కు కావాల్సిన ప్రతిదాన్ని పంపుతాను. నేను చెప్పింది చేయకుంటే.. ఒక్క హమాస్ సభ్యుడు కూడా మిగలడు. మీ చెరలో బందీలుగా ఉండి ఇటీవల విడుదలైన వారిని నేను కలిశాను. ఇదే మీకు చివరి హెచ్చరిక. గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు వేచి చూస్తోంది. మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
హమాస్కు ట్రంప్ ఇలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో కూడా తీవ్రంగా హెచ్చరించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఈలోపు బందీలను విడుదల చేయాలని తేల్చి చెప్పారు. లేదంటూ నరకం చూస్తారని, గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఇలా హమాస్కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.
1997లో హమాస్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. అప్పటి నుంచి హమాస్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. అయితే 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్పై దాడి చేసి దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి హమాస్ చెరలోనే మగ్గుతున్నారు. ఇటీవల ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో కొందరు బందీలను హమాస్ విడుదల చేసింది. అలాగే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే ఇంకా ఇజ్రాయెల్, విదేశీ బందీలు హమాస్ చెరలోనే ఉన్నారు. అయితే వారిని విడిపించేందుకు నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతినిధి ఆడమ్ బోహ్లర్.. నేరుగా హమాస్తో చర్చలు జరిపి.. బందీలను విడుదల చేయాలని కోరారు.
ప్రస్తుతం హమాస్ చెరలో 59 మంది బందీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బందీల్లో 5 మంది అమెరికన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొంత మంది బందీలు చనిపోయారు. అయితే వారి విడుదల కోసం వైట్ హౌస్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్.. ఖతార్ ప్రధాన మంత్రిని కలవాలని అనుకున్నారు. కాల్పుల విరమణ గురించి చర్చించాలని భావించారు. కానీ అందుకు హమాస్ ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. దీంతో స్టీవ్ విట్కాఫ్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. ఈ ఒప్పందం గత శనివారంతో ముగిసింది. మరో దఫా ఒప్పందం జరగాల్సి ఉంది. కానీ దీనిపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. హమాస్ను తీవ్రంగా హెచ్చరించారు. బందీలను విడుదల చేయకపోతే అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా గాజాను స్వాధీనం చేసుకుంటామని.. పాలస్తీనియన్లు.. గాజాను విడిచి పెట్టాలని కూడా ట్రంప్ హెచ్చరించారు. ఇంకోవైపు ఇజ్రాయెల్ కూడా మరోసారి యుద్ధానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.