National Herald Case : దూకుడు పెంచిన ఈడీ.. కాంగ్రెస్కు చెందిన యంగ్ ఇండియా ఆఫీస్ సీజ్..
National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది;
National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది. మనీలాండరింగ్ వ్యవహారంతో సంబంధమున్న యంగ్ ఇండియన్ ఆఫీసును ఈడీ తాత్కాలికంగా సీల్ చేసింది. మంగళవారం ఢిల్లీ, లక్నో, కోల్కతాలోని 10, 12 ప్రాంతాల్లో సోదాలు జరిపిన ఈడీ...కాంగ్రెస్కు చెందిన హెరాల్డ్ హౌస్లోని యంగ్ ఇండియన్ హౌస్ను సీజ్ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. అనుమతి లేకుండా యంగ్ ఇండియన్ ఆఫీసును తెరవొద్దని ఆదేశాలు జారీ చేసింది.
మంగళవారం జరిపిన సోదాల్లో అధికార ప్రతినిధులు ఎవరూ హాజరుకాకపోవడంతో సాక్ష్యాలు సేకరించలేకపోయామని..వాటిని భద్రపరిచేందుకే తాత్కాలికంగా..సీజ్ చేస్తున్నట్లు తెలిపింది. నేషనల్ హెరాల్డ్ ఆఫీసులో యంగ్ ఇండియా మినహా మిగతా సంస్థలు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని తెలిపింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోదాలు, యంగ్ ఇండియన్ ఆఫీసు సీల్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, సోనియా గాంధీ నివాసం దగ్గర భారీ సంఖ్యలో మోహరించారు. ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసుకు వెళ్లే రోడ్డును ఎందుకు బ్లాక్ చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేశ్ ప్రశ్నించారు. ఇది ఆనవాయితీగా మారిందని..ఇలా ఎందుకు చేస్తున్నారనేది రహస్యంగా మారిందన్నారు.
ఐతే అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇక ఇదే అంశంపై చర్చించేందుకు ఇవాళ కాంగ్రెస్ రాజ్యసభ, లోక్సభ ఎంపీలు పార్లమెంటరీ ఆఫీసులో భేటీ కానున్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు.
కాంగ్రెస్కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్లో ఆరోపించారు.
ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్లను ఈడీ ప్రశ్నించింది. మూడు రోజుల విచారణలో భాగంగా సోనియాకు వందకు పైగా ప్రశ్నలు సంధించింది. ఏజేఎల్, యంగ్ ఇండియన్ మధ్యలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై సోనియాను ప్రశ్నించగా.. అవన్నీ మోతీలాల్ వోరాకే తెలుసని ఆమె చెప్పినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన మోతీలాల్ వోరా.. మధ్యప్రదేశ్ సీఎంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా, ఆలిండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగానూ వ్యవహరించారు. 2020 డిసెంబరులో ఆయన అనారోగ్యంతో చనిపోయారు.