Robert Vadra: రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ సమన్లు

రేపు విచారణకు హాజరుకావాలని నోటీసు;

Update: 2025-06-17 06:15 GMT

వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. యూకేకు చెందిన ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద వాంగ్మూలం నమోదు చేయడానికి బుధవారం ఈడీ ప్రధాన కార్యాలయానికి రావల్సిందిగా ఈడీ నోటీసులో పేర్కొంది.

ఈనెల 10న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నెలాఖరులో విదేశీ పర్యటనకు ముందుగానీ.. తర్వాత గానీ హాజరవుతానని వాద్రా తెలిపారు. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనడానికి విదేశాలకు వెళ్తున్నట్లు ఈడీకి తెలియజేశారు. ఇంకా ఎమర్జెన్సీగా హాజరు కావాలంటే వర్చువల్‌గా హాజరవుతారని న్యాయవాది సమాచారం అందించారు. మొత్తానికి ఆయా కారణాలు చెప్పి తప్పించుకున్నారు. తాజాగా మరోసారి అధికారులు నోటీసులు ఇచ్చారు. బుధవారం విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

వాద్రా వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత ఛార్జిషీట్ దాఖల చేయాలని ఈడీ భావిస్తోంది. ఇదిలా ఉంటే రాజకీయ ప్రయోజనాల కోసం తనను వేధిస్తున్నారని.. ఇబ్బంది పడుతున్నారని రాబర్ట్ వాద్రా ఆరోపిస్తున్నారు. వివిధ మనీలాండరింగ్ కేసుల్లో గతంలో మూడు రోజుల పాటు వాద్రాను ఈడీ అధికారులు విచారించారు.

Tags:    

Similar News