BHOPAL: ఓటు వేయండి.. గిఫ్ట్ పట్టండి

భోపాల్‌లో ఎన్నికల అధికారుల వినూత్న పంథా... ఒక్క ఓటర్‌కు డైమండ్‌ రింగ్‌

Update: 2024-05-09 01:30 GMT

ఓటువేయండి గిఫ్టు పట్టండి....ఔను మీరు వింటున్నది నిజమే. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భోపాల్‌లో మూడో విడత పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు వినూత్నరీతిలో ఓటర్లను ఆకర్షించారు. పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లను రప్పించేందుకు అధికారులు విలువైన బహుమతులతో కూడిన లక్కీడ్రా ఏర్పాటు చేశారు. పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఓటు వేసిన వారి పేర్లతో కూడిన చీటీలతో లక్కీడ్రా నిర్వహించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం నుంచి ముగ్గురు ఓటర్లను విజేతలుగా నిర్ణయించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ లక్కీడ్రాలో ఒక ఓటరు డైమండ్‌ రింగ్‌ను గెలుపొందినట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో మొదటి, రెండో విడత పోలింగ్‌లో వరుసగా 67.75 శాతం, 58.89 శాతం నమోదైంది. దీంతో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు ఈ లక్కీడ్రా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.


ఉత్తరప్రదేశ్‌లో హోరాహోరీ

దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌. అక్కడ మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ప్రధాన పార్టీలు ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధిక సీట్లు రాబట్టేందుకు యత్నిస్తాయి. గత ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా 62 సీట్లలో గెలుపొందింది. ఈ దఫా "చార్‌ సౌ పార్" నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తున్న కమలం పార్టీ.....గతంలో కంటే ఎక్కువ స్థానాలను యూపీలో గెలవాలని భావిస్తోంది. యూపీలో ఇప్పటికే తొలి మూడు విడతల్లో 26 స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. మే 13న షాజహాన్‌పూర్, ఖేరి,ధౌరహర, సీతాపూర్, హర్దోయి, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఇటావా, కన్నౌజ్, కాన్పూర్, అక్బర్‌పూర్, బహ్రాయిచ్‌ సీట్లకు ఓటింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఈ అన్ని స్థానాల్లో భాజపా విజయభేరీ మోగించింది. అయితే ఇందులోని కొన్ని స్థానాల్లో ఈ సారి కమలం పార్టీకి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

కన్నౌజ్ లోక్‌సభ స్థానంలో పోరు రసవత్తరంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ-SP కంచుకోటగా భావించే ఈ సీటులో 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది. 1998 నుంచి 2014 వరకు ఈ స్థానం SP చేతిలోనే ఉండేది. 2019 ఎన్నికల్లో భాజపా అనూహ్యంగా ఈ సీటును దక్కించుకుంది. భాజపా నేత సుబ్రత్ పాఠక్ 12 వేల 353 ఓట్ల స్వల్ప తేడాతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్‌పై గెలుపొందారు. ఈసారి ఎలాగైనా కన్నౌజ్‌ను దక్కించుకోవాలని భావిస్తున్న అఖిలేశ్ యాదవ్.....స్వయంగా తనే పోటీకి దిగారు. తొలుత కన్నౌజ్‌లో అఖిలేశ్‌ మేనల్లుడు తేజ్‌ప్రతాప్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. కార్యకర్తలు, పలువురు నేతల నుంచి తలెత్తిన అసంతృప్తి కారణంగా స్వయంగా అఖిలేశ్ బరిలో నిలిచారు. కన్నౌజ్‌లో అఖిలేశ్ యాదవ్ మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు. తొలిసారి 2000 సంవత్సరంలో విజయం సాధించిన ఆయన ఆ తర్వాత 2004, 2009లోనూ గెలుపొందారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ గెలుపొందడంతో కన్నౌజ్ లోక్‌సభ స్థానానికి అఖిలేశ్ రాజీనామా చేశారు. ఆ సమయంలో ఈ స్థానాన్ని ఆయన ...సతీమణి డింపుల్ యాదవ్‌కు అప్పగించారు. 2012 ఉపఎన్నిక, 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన డింపుల్ 2019లో మాత్రం ఓటమిపాలయ్యారు. అయితే మరోసారి అఖిలేశ్‌ రాకతో ఈ స్థానంలో పోరు ఆసక్తిగా మారింది. బీజేపీ నుంచి మరోసారి సుబ్రత్ పాఠక్ బరిలో ఉన్నారు. BSP నుంచి ఇమ్రాన్‌ బిన్ జాఫర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు సమాజ్‌వాదీ పార్టీకి కలిసొచ్చే అంశమని తెలుస్తోంది.

Tags:    

Similar News