Rajasthan result: రాజస్థాన్ రాజు ఎవరో ?
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. రాజస్థాన్ ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ;
రాజస్థాన్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్కు ఆధిక్యం మారుతోంది. భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల్లో.. హోరాహోరీ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ హస్తం పార్టీ కమలం పార్టీ రౌండ్ రౌండ్కు ఆధిక్యాన్ని మార్చుకుంటున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కంటే భాజపా కాస్త ముందంజలో ఉంది. గతనెల 25న ఓటింగ్ జరిగిన 199స్థానాలకు ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా 4.36 లక్షల పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. మొత్తం 199నియోజకవర్గాలకు సంబంధించి 66 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటివరకూ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే కాస్త ముందంజలో ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఓట్లలెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
రాజస్థాన్లో మొత్తం 2వందల శాసనసభ స్థానాలు ఉన్నప్పటికీ కరణ్పుర్లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మిత్సింగ్ హఠాన్మరణం చెందటంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. దీంతో 199 స్థానాలకు ఓటింగ్ జరిగింది. రాజస్థాన్లో మొత్తం 33జిల్లాలు ఉండగా జయపుర, జోథ్పుర్, నాగౌర్లో 2 చొప్పున, మిగితా జిల్లాల్లో ఒకటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 51వేల 8వందల 96 పోలింగ్ కేంద్రాల్లోని EVMల కోసం 2వేల 5వందల 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. షియో నియోజకవర్గానికి సంబంధించి 41రౌండ్లు, దక్షిణ అజ్ మేర్లో 14రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ఫలితాలను సకాలంలో ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు రాజస్థాన్ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.
రాజస్థాన్లో ఐదేళ్లకోసారి అధికారం మారే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగుతుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలే తమను విజయతీరాలకు చేరుస్తాయని ఆ పార్టీనేతలు అంటున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ వంద స్థానాల్లో, భాజపా 73 సీట్లు గెలుపొందాయి. మ్యాజిక్ మార్క్కు ఒక్క స్థానం తగ్గినా బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో అశోక్ గహ్లోత్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈసారి తమదే అధికారమని భాజపా నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ప్రభుత్వ వ్యతిరేకత, మోజీ ఛరిష్మా, అధికారం మారే సంప్రదాయం తమకు అనుకూలించే అంశాలని భాజపా నేతలు చెబుతున్నారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు రాజస్థాన్ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. ఓటింగ్ కేంద్రం వద్దకు ఇతరులు ఎవరూ రాకుండా, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 40కంపెనీల కేంద్ర పారా మిలిటరీ బలగాలు, 36 కంపెనీల రాజస్థాన్ ఆర్మ్డ్ పోలీసులను మోహరించారు