ISRO Chief : ప్రజ్ఞాన్ లక్ష్యం నెరవేరింది
సోమనాథ ఆలయంలో ఇస్రో చీఫ్ పూజలు, మీడియా తో కాసేపు;
చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై ఏం చేయాలని మనం కోరుకున్నామో అది ఇప్పటికే పూర్తీ చేసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ప్రస్తుత నిద్రాణ స్థితి నుంచి అది తిరిగి పని చేసే స్థితికి రాకపోయినప్పటికీ సమస్య ఏమీ ఉండదని తెలిపారు. నవంబరు లేదా డిసెంబరులో ఎక్స్-రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని ప్రయోగించడంపై దృష్టి సారించామన్నారు.
గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ తమ కల అని, జ్యోతిర్లింగ స్వరూపుడు సోమనాధీశ్వరుడి వల్లే ఆ మిషన్ సక్సెస్ అయినట్లు ఇస్రో చీఫ్ వెల్లడించారు. తమ పనులు పూర్తి చేసుకునేందుకు శక్తి కావాలని, మూన్పై ల్యాండింగే కీలకమైన అంశమని, భవిష్యత్తులో చేపట్టబోయే మిషన్లకు శక్తి కావాలని దేవుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమం అనంతరం ఇస్రో చీఫ్ సోమనాథ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నవంబర్ లేదా డిసెంబర్లో జరిగే ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ ప్రయోగానికి నేషనల్ స్పేస్ ఏజెన్సీ సన్నాహాలు చేస్తోందని చెప్పారు. ఖగోళాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్పై (ఎక్స్పోశాట్) ప్రస్తుతం దృష్టి సారించినట్టు ఇస్రో చీఫ్ తెలిపారు. ఎక్స్పోశాట్తో పాటూ ఇన్శాట్-3డీని కూడా నవంబర్-డిసెంబర్ నెలల్లో ప్రయోగించనున్నట్టు వెల్లడించారు. చంద్రునిపై స్లీప్ మోడ్ లో ఉన్న ప్రజ్ఞాన్ పరిస్థితి గురించి ఇస్రో చీఫ్ మాట్లాడుతూ.. చంద్రునిపై ఉష్ణోగ్రత సున్నా కంటే 200 డిగ్రీల సెల్సియస్కు పడిపోయిందని, దాని ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు దెబ్బతినకపోతే నిద్ర నుండి మేల్కొంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం విక్రమ్, ప్రజ్ఞాన్ల నుంచి ఎలాంటి సిగ్నల్ అందలేదని తెలిపారు.
చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉదయం ప్రారంభమైనందున ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్తో ఈ నెల ప్రారంభంలో వారి స్థితిని తెలుసుకోవడానికి వారితో కమ్యూనికేషన్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేశామని ఇస్రో గత వారం తెలిపింది. అయితే.. ఎటువంటి స్పందన రాలేదు. సిగ్నల్ అందలేదని తెలిపారు. చంద్రునిపై రాత్రి పడకముందే.. ల్యాండర్, రోవర్ రెండింటినీ స్లీప్ మోడ్లో పెట్టిన విషయం తెలిసిందే.