Supreme Court: ఓడితే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినట్టా? సుప్రీంకోర్టు
కేఏ పాల్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం;
ఏ ఎన్నికలు జరిగినా.. ఓడిపోయిన పార్టీలు, అభ్యర్థులు.. ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై ఆరోపణలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. తాజాగా వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని.. ఏకంగా ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సార్లు ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని ఆరోపణలు గుప్పించింది. ఈ నేపథ్యంలోనే కోర్టుల్లో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా.. అంతకుముందు ఉపయోగించిన పేపర్ బ్యాలెట్ పద్దతిని తీసుకురావాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ పేపర్ ఓటింగ్ తీసుకురావాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సహా పలువురు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీబీ వరాలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. విదేశాల్లో ప్రస్తుతం కూడా బ్యాలెట్ పేపర్ విధానం అమలు చేస్తున్నారని.. అందుకే భారత్లో కూడా అదే విధానాన్ని తీసుకువస్తే బాగుంటుందని కేఏ పాల్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా దేశంలో రూ.వేల కోట్లలో అవినీతి జరుగుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈవీఎం విధానాన్ని రద్దు చేసి తిరిగి పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహించేలా ఆదేశాలివ్వాలని తన పిటిషన్లో కేఏ పాల్ కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఆలోచనలు ఎలా వస్తాయి?
ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేసిన అభ్యర్థులను కనీసం ఐదేండ్లు అనర్హులుగా ప్రకటించాలని కేఏ పాల్ తన పిటిషన్లో కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘మీ దగ్గర చాలా ఆసక్తికర వ్యాజ్యాలు ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు మీకు ఎలా వస్తాయి?’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. కేఏ పాల్ వ్యాజ్యాన్ని కొట్టేసింది.