Bihar Exit Poll : బీహార్లో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం ? ఎగ్జిట్ పోల్స్ అంచనా
మహాగట్బంధన్కు నిరాశ తప్పదంటున్న సర్వేలు, పనిచేయని ప్రశాంత్ కిశోర్ 'జన్ సురాజ్' ఫ్యాక్టర్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మరోసారి ఘన విజయం సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో చెబుతున్నాయి. మంగళవారం రెండో విడత పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన దాదాపు అన్ని సర్వేలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకే అధికారాన్ని కట్టబెట్టాయి. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి అయిన మహాగట్బంధన్ కూటమికి తీవ్ర నిరాశ తప్పదని అంచనా వేశాయి.
వివిధ జాతీయ సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఎన్డీయేకు 130 నుంచి 167 సీట్ల వరకు దక్కే అవకాశం ఉంది. మరోవైపు, మహాగట్బంధన్ కూటమి 70 నుంచి 108 స్థానాల మధ్య పరిమితం కావొచ్చని తెలుస్తోంది. బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 సీట్ల మేజిక్ ఫిగర్ అవసరం కాగా, ఎన్డీయే సునాయాసంగా ఆ మార్కును దాటుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతారని భావించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ 'జన్ సురాజ్' పార్టీ ఏమాత్రం సత్తా చాటలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. చాలా సర్వేలు ఆయన పార్టీకి 0 నుంచి 5 సీట్ల లోపే వస్తాయని పేర్కొన్నాయి. దీంతో, బీహార్ రాజకీయాలపై 'పీకే ఫ్యాక్టర్' పనిచేయలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, మిథిలాంచల్, భాగల్పూర్ వంటి ప్రాంతాల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, 65 శాతం మంది మహిళా ఓటర్లు ఎన్డీయేకు మద్దతుగా నిలిచినట్లు ఈ సర్వే వెల్లడించింది. అలాగే, 51 శాతం ఓబీసీలు, 49 శాతం ఎస్సీ ఓటర్లు కూడా ఎన్డీయే వైపే మొగ్గు చూపినట్లు పేర్కొంది.
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈ విధంగా ఉన్నప్పటికీ, పూర్తి ఫలితాలు తెలియాలంటే ఓట్ల లెక్కింపు వరకు వేచి చూడాల్సిందే.
బీహార్ లో మొత్తం 243 స్థానాలకు గాను... నవంబరు 6న జరిగిన తొలి విడతలో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. నేడు (నవంబరు 11) రెండో విడతలో మిగిలిన 122 స్థానాలకు పోలింగ్ చేపట్టారు. పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియగానే, ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి.