UPI payments: యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలుండవ్‌

రూ.3 వేలు దాటితే ఛార్జీలు అబద్ధం అంటున్న ఆర్థిక శాఖ;

Update: 2025-06-12 01:45 GMT

 యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. చిన్ని చిన్న షాపుల్లో పేమెంట్స్‌కి కూడా గూగుల్ పే, ఫోన్ ఫే వంటి యూపీఐ ఆధారిత యాప్స్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా పేమెంట్లపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలను వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రూ.3000 కన్నా ఎక్కువ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారమే అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.

అధిక విలువైన డిజిటల్‌ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయంటూ పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో వీటికి సహకరించాలనే లక్ష్యంతో ఎండీఆర్‌ ఛార్జీలను విధించాలని కేంద్రం భావిస్తోందంటూ వార్తలు వచ్చాయి. వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా, లావాదేవీల విలువ ఆధారంగా ఎండీఆర్ వసూలు చేసేందుకు చర్చలు సాగుతున్నాయని పలు నివేదికలు వెలువడ్డాయి. అధిక విలువైన డిజిటల్ పేమెంట్స్ నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని సూచించాయి.

ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ కేంద్రం సీరియస్‌గా స్పందించింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కేంద్ర ఆర్థిక శాఖ ప్రజలకు సూచించింది. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ప్రచారం ద్వారా తప్పుదారి పట్టిస్తున్నారని, ప్రజల్లో అనవసరమైన అనిశ్చితి, భయాందోళనకు కారణమవుతున్నారని ఎక్స్‌లో మండిపడింది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపింది.

Tags:    

Similar News