ఢిల్లీలో మూడు రాష్ట్రాల రైతుల నిరనస మరో టర్న్ తీసుకుంది. రైతు సంఘాల ఢిల్లీ చలో మార్చ్ను అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించుకోవడం, లాఠీ ఛార్జ్, రబ్బరు బుల్లెట్, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఖండించింది. ఫిబ్రవరి 16న దేశంలో గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మెను మరింత భారీగా విజయవంతం చేయాలని ఎస్కెఎం జనాలను కోరింది.
రైతులను అడ్డుకునేందుకు సాయుధ భద్రతా బలగాలను దింపడం ద్వారా మోడీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించి, వారి జీవనోపాధిని కాపాడే డిమాండ్లను పరిష్కరించాల్సిన రెస్పాన్సిబులిటీ మోడీకి ఉందని తెలిపింది. కనీస మద్దతు ధర అమలు చేస్తామని 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసి పదేళ్ల తరువాత కూడా అమలు చేయలేదని ఫైరయ్యారు రైతు సంఘాల నేతలు.
వెంటనే సాయుధ బలగాలను ఉపసంహరించుకోవాలని, రైతుల హక్కులను కాపాడాలని కోరుతూ ఎస్కెఎం ప్రధానికి లెటర పంపింది. 2021 డిసెంబరు 9న ఎస్కెఎంకి కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసింది. పంజాబ్ సరిహద్దుల్లోని హైవేలపై కాంక్రీట్ బారికేడ్లు, ఇనుప మేకులు, ముళ్ల తీగలు ఏర్పాటు చేయడం, ఇంటర్నెట్ను నిలిపివేయడం, 144 సెక్షన్ విధించడం ద్వారా ఏర్పడ్డ భయానక వాతావరణం వెంటనే తగ్గించాలని కోరింది.