Savitri Jindal: కాంగ్రెస్ పార్టీకి సావిత్రి జిందాల్ రాజీనామా
బీజేపీ లో చేరిన భారత సంపన్న మహిళ;
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. హర్యానా కురుక్షేత్ర నుంచి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజులకే ఆయన తల్లి, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కూడా బీజేపీలో చేరారు. 84 ఏళ్ల సావిత్రి జిందాల్, తన కుమార్తె సీమాతో కలిసి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ షైనీ, మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జిందాల్ తన కుటుంబ సభ్యుల సలహా మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను పది సంవత్సరాలుగా హిసార్ ఎమ్మెల్యేగా ప్రజలకు ప్రాతినిథ్యం వహించానని.. రాష్ట్రానికి నిస్వార్థంగా సేవ చేశానన్నారు. కుటుంబ సభ్యుల సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. తనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకత్వానికి, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
2005 జిందాల్ హిసార్ నియోజకవర్గం నుంచి హర్యానా విధానసభకు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆమె భర్త ఓం ప్రకాశ్ జిందాల్ చాలాకాలం పాటు హిసార్కు ప్రాతినిధ్యం వహించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. 29 అక్టోబర్ 2013న హర్యానా ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా నియామకమయ్యారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ, గృహనిర్మాణం శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె హర్యానా శాసనసభ సభ్యురాలిగా చేశారు. 2010 వరకు విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగారు. 2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ నుంచి ఓడిపోయారు.
భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ పేరు అగ్రస్థానంలో ఉంది. ఆమె వయస్సు 84 సంవత్సరాలు. జిందాల్ గ్రూప్ భారీ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. మార్చి 28, 2024 నాటికి, సావిత్రి జిందాల్ నికర విలువ 29.6 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు రూ.2.47 లక్షల కోట్లు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో సావిత్రి జిందాల్ 56వ స్థానంలో ఉన్నారు.