గాలా ప్రెసిషన్ ఇంజినీరింగ్ ఐపీఓకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. సోమవారం ఐపీవో ప్రారంభమైన నిమిషాల్లోనే షేర్లన్నీ పూర్తిగా సబ్స్క్రైబ్ అయ్యాయి. 22.24 లక్షల షేర్లు పబ్లిక్ ఇష్యూలో అందుబాటులో ఉండగా.. ఉదయం 11.21 గంటలకే 47.77 లక్షల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ సెగ్మెంట్లో 3.15 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో2.54 రెట్ల షేర్లకు దరఖాస్తులు లభించాయి. సెప్టెంబరు 4 వరకు సబ్స్క్రిప్షన్ కొనసాగనుంది.గాలా ప్రెసిషన్ ఇంజినీరింగ్ తమ ఐపీవో ధరను రూ.503-529గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు రూ.14,812తో కనీసం 28 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ ధర వద్ద మొత్తం రూ.168 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ఐపీవోలో రూ.135.34 కోట్లు విలువ చేసే 25.58 లక్షల కొత్త షేర్లతో పాటు రూ.32.58 కోట్లు విలువ చేసే షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద అందుబాటులో ఉన్నాయి. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను తమిళనాడులో కొత్త తయారీ కేంద్రం ఏర్పాటు, కొత్త పరికరాల కొనుగోలు, లోన్ చెల్లింపులు వంటి వాటికి వినియోగిస్తామని కంపెనీ వెల్లడించింది. మరికొన్ని నిధులను కార్పొరేట్ అవసరాలకు కూడా వాడతామని చెప్పింది.