Goods Train Fire: డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకు మంటలు..
చెన్నై-అరక్కోణం మార్గంలో నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు;
తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డీజిల్ తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు అంటుకున్నాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీ డీజిల్తో 52 వ్యాగన్లతో కూడిన గూడ్సు రైలు చెన్నై పోర్టు నుంచి బెంగళూరుకు వెళ్తున్నది. ఈ క్రమంలో తిరువల్లూరు సమీపంలో రైలోలోని ఓ వ్యాగన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఐదు వ్యాగన్లకు వ్యాపించడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో నల్లటి పొగలు దట్టంగా అలముకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా, ప్రమాదం నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అదేవిధంగా చెన్నై-అరక్కోణం మధ్య రైళ్ల రాకపోకలను ఆపివేశారు. ప్యాసింజర్ రైళ్లను దారిమళ్లిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియ్సా ఉన్నది.