Tamil Nadu: ప్రసంగం చేయకుండా అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్
స్టాలిన్ సర్కార్కు గవర్నర్ రవి షాక్
తమిళనాడు ఎన్నికల ముంగిట అసెంబ్లీలో కీలక పరిణామం జరిగింది. స్టాలిన్ సర్కార్-రాజ్భవన్ మధ్య ఎప్పుడూ వార్ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఆ యుద్ధ వాతావరణం మరోసారి బయటపడింది. మంగళవారం ఉదయం తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే గవర్నర్ ఆర్ఎన్.రవి ప్రసంగంతో సభ ప్రారంభం కావాల్సి ఉంటుంది. అయితే సభకు హాజరైన కొన్ని నిమిషాలకే వెనుదిరిగారు. దీంతో ఈ వ్యవహారం పొలిటికల్గా దుమారం రేపుతోంది.
అసెంబ్లీ సమావేశాలకు ముందు జాతీయ గీతంతో సభ ప్రారంభం అవుతుంటుంది. అయితే జాతీయ గీతం కాకుండా.. రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. దీంతో గవర్నర్ ఆర్ఎన్.రవి ఆగ్రహంతో రగిలిపోయారు. వెంటనే పొడియం మీద నుంచి దిగిపోయి కారెక్కి వెళ్లిపోయారు. దీంతో సభ్యులంతా షాక్కు గురయ్యారు. గవర్నర్ ఇలా వెళ్లిపోవడం మూడోసారి. గతంలో కూడా రెండు సార్లు ఇలానే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
ఇక గవర్నర్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడంతో గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మైక్రోఫోన్ను ‘‘పదేపదే స్విచ్ ఆఫ్ చేసింది’’ అని.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలో ‘‘అనేక ఆధారాలు లేని వాదనలు, తప్పుదారి పట్టించే ప్రకటనలు.’’ ఉన్నాయని ఆరోపించింది. ‘‘ప్రజలను ఇబ్బంది పెడుతున్న కీలకమైన అంశాలను విస్మరించారు.’’ అని గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది.