హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ప్రభుత్వ భవనంపై 'ఖలిస్తాన్ జిందాబాద్' నినాదాలు, కలకలం రేపుతున్నాయి. ధర్మశాలలో జలశక్తి డిపార్ట్మెంట్ భవనం గోడపై 'ఖలిస్తాన్ జిందాబాద్' నినాదాలు కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. కాంగ్రా పోలీసు సూపరింటెండెంట్, షాలిని అగ్నిహోత్రి మాట్లాడుతూ.. భవనం గోడలపై వివాదాస్పద వ్యాఖ్యలను కలర్ పెయింట్ చేయడం, ఖలిస్తాన్ జెండాలు స్థానికంగా కలకలం రేపాయన్నారు. దీనికి సంబంధించి మంగళవారం రాత్రి అధికారులకు సమాచారం అందిందని, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం గోడకు రంగులు వేయించినట్లు తెలిపారు. ఈ ఘటన క్రమంలో అక్కడి సీసీటీవీ కెమెరా దృశ్యాలను చెక్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఐదు మ్యాచ్లు అక్టోబర్లో ధర్మశాలలో జరగనున్నాయి. ఇప్పటికే పలు జట్లు నగరానికి చేరుకోవడం ప్రారంభించినందున ఈ సంఘటన ఆందోళన కలిగించిందని అధికారులు తెలిపారు.