గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ఓ కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ని తక్షణమే లొంగిపోవాలని ఆదేశించింది. కల్పిత ఆధారాలు సృష్టించారన్న కేసులో హైకోర్ట్ ఈ ఆదేశాలు జారీ చేసింది. సెతల్వాడ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ని కూడా తిరస్కరించింది. అయితే గత సంవత్సరం సుప్రీంకోర్టు ఆమెని అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుంచి అరెస్ట్ నుంచి రక్షణ పొందుతోంది.
గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో సామాజిక కార్యకర్త అయిన తీస్తా సెతల్వాడ్, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) ఆర్బీ శ్రీకుమార్లను కల్పిత సాక్ష్యాధారాలు, తప్పుడు పత్రాలు సృష్టించడం, కుట్ర వంటి నేరారోపణలతో వారిద్దరినీ 2022 జూన్ 25న అరెస్ట్ చేశారు. గత సంవత్సరం 2022 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్తో ఉపశమనం పొందిన తీస్తా, గుజరాత్లోని సబర్మతి జైల్ నుంచి తీస్తా విడుదలైంది.
ఈ కేసుకు సంబంధించి గుజరాత్ ATS FIR నమోదు చేసింది. దాని ప్రకారం గుజరాత్ అల్లర్లపై విచారణ జరిపేందుకు ఏర్పడిన నానావతి కమిషన్ ముందు వీరు సాక్షులతో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించారని ఆరోపించింది. తీస్తా సెతల్వాడ్, శ్రీ కుమార్లు తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించడం ద్వారా అమాయకుల్ని ఇరికించేలా, చట్టాల్ని దుర్వినియోగపరచేలా చేశారని తీవ్ర ఆరోపణలు చేసింది.