Hampi Gang Rape: ఇజ్రాయెల్ టూరిస్ట్పై గ్యాంగ్ రేప్.. ముగ్గురికి ఉరిశిక్ష
హంపి మృగాళ్లకు ఉరిశిక్ష..
కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం హంపి సమీపంలో గత ఏడాది జరిగిన దారుణ ఘటనపై సోమవారం కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని సెషన్స్ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఒక పర్యాటకుడిని హత్య చేసిన ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ వారికి మరణశిక్ష విధించింది.
అసలేం జరిగిందంటే..
దోషులు మల్లేష్ అలియాస్ హండిమల్ల, సాయి, శరణప్ప గత ఏడాది మార్చిలో జరిగిన ఈ కేసులో అత్యాచారం, హత్య నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించిన కోర్టు శిక్షను ప్రకటించింది. హంపికి సమీపంలోని సనపురాలోని తుంగభద్ర ఎడమ ఒడ్డు కాలువ సమీపంలో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది మార్చి 6వ తేదీ రాత్రి, హంపికి సమీపంలోని సనపురా వద్ద తుంగభద్ర కాలువ సమీపంలో ఈ ముగ్గురు దోషులు ఆ రాత్రి పర్యాటకుల వద్దకు వెళ్లి, వారిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో పర్యాటకులపై దాడికి దిగారు. ముగ్గురు పురుష పర్యాటకులను బలవంతంగా కాలువలోకి తోసివేశారు. ఆ సమయంలో అక్కడున్న ఇద్దరు మహిళలపై పైశాచికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కాలువలోకి నెట్టిసిన వారిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, ఒడిశాకు చెందిన ఒక పర్యాటకుడు మాత్రం నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. పర్యాటక ప్రాంతంలో జరిగిన ఈ దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసును విచారించిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తి, ఈ నేరం “అరుదైన వాటిలో అత్యంత అరుదైనది” (Rarest of Rare) అని పేర్కొన్నారు. పర్యాటకులపై అమానుషంగా దాడి చేసి, ప్రాణాలు తీసి, మహిళలను వేధించిన ఈ ముగ్గురికీ మరణశిక్షే సరైనదని తీర్పు వెల్లడించారు.