Honeymoon Murder:రాజాలాగే మరో మహిళను హత్య చేసి సోనమ్ గా నమ్మించాలని ప్లాన్..
హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు..;
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా రఘువంశీని అత్యంత దారుణంగా హత్య చేయించింది భార్య సోనమ్ రఘువంశీ. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్లాన్ చేసి, ఈ దారుణానికి తెగబడింది. ముగ్గురు కిరాయి హంతకులతో మేఘాలయలోని కాసీ హిల్స్లో రాజాను మర్డర్ చేశారు. మే 23న రాజా హత్య జరిగితే, జూన్ 02న పోలీసులకు అతడి మృతదేహం లభ్యమైంది. చివరకు, జూన్ 08న నిందితురాలు సోనమ్ యూపీలోని ఘాజీపూర్ పోలీసుల ముందు లొంగిపోయింది.
అయితే, ఇప్పుడు నిందితులందర్ని మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు. ఈ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత, మరో మహిళను కూడా హత్య చేయాలని నిందితులు ప్లాన్ చేసినట్లు తేలింది. సోనమ్ కూడా చనిపోయిందని నమ్మించాలనే ప్రయత్నంలో మహిళను హత్య చేయాలని భావించారు.
రాజాను చంపడానికి కుట్ర ఇండోర్లో జరిగింది. మే 11న సోనమ్తో అతడి వివాహం జరిగింది. దీనికి ముందే హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి సోనమ్ లవర్ రాజ్. ఈ కుట్రకు సోనమ్ అంగీకరించిందని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా ఎస్పీ వివేక్ సయీమ్ చెప్పారు. హత్య తర్వాత బుర్ఖా ధరించి సోమన్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ హత్యకు పాల్పడిన కాంట్రాక్ట్ కిల్లర్స్ విశాల్, ఆకాష్, ఆనంద్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
మేలో వీరిద్దరి వివాహం జరిగితే ఫిబ్రవరి నుంచే హత్యకు ప్లాన్ చేశారు. ఒక పథకం ప్రకారం, సోనమ్ నదిలో కొట్టుకుపోతున్నట్లు ప్రజల్ని నమ్మించడం, మరొక పథకం ప్రకారం, ఎవరైనా మహిళను హత్య చేసి మృతదేహాన్ని తగులబెట్టడం వంటివి ప్లాన్ చేశారు. ముందుగా మేఘాలయలో కాకుండా, గౌహతిలోనే రాజాను హత్య చేయాలని ప్లాన్ చేశారు.