Uttar Pradesh : కుప్పకూలిన ఆస్పత్రి లిఫ్ట్... బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మృతి
హాస్పిటల్ లో బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం మహిళను జనరల్ వార్డుకు తరలిస్తుండగా విషాదం జరిగిపోయింది. ప్రమాదవశాత్తు లిఫ్ట్ కుప్పకూలడంతో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఇది జరిగింది. 30 ఏళ్ల కరిష్మా సిజేరియన్ ఆపరేషన్ కోసం డిసెంబర్ 5న ఉదయం కేపిటల్ హాస్పిటల్లో చేరింది. అక్కడామె పాపకు జన్మనిచ్చింది. ఆపరేషన్ అనంతరం సాయంత్రం ఆమెను స్ట్రెచర్ పై జనరల్ వార్డుకు తరలిస్తుండగా బెల్ట్ తెగిపోవడంతో లిఫ్ట్ కుప్పకూలింది. లోపల చిక్కుకున్న వారు భయంతో కేకలు పెట్టారు. కొందరు లిఫ్ట్ డోర్లు తెరిచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో ఆస్పత్రిలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. చివరికి టెక్నీషియన్లు వచ్చి డోర్లు తెరిచి లోపలున్న వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో కరిష్మా తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కరిష్మా మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భావించిన కరిష్మా కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రిపై దాడిచేసి ధ్వంసం చేశారు.