Delhi High Court: భర్త అక్రమ సంబంధం భార్య పట్ల క్రూరత్వం కాదు -ఢిల్లీ హైకోర్టు
వేధింపులు నిరూపిస్తేనే వివాహేతర సంబంధం నేరం అని స్పష్టం;
ఒక వ్యక్తి వివాహేతర సంబంధం భార్యను వేధించినట్లు లేదా హింసించినట్లు చూపించకపోతే అది క్రూరత్వం లేదా ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది. భర్త వివాహేతర సంబంధం భార్య వరకట్న మరణానికి పాల్పడటానికి కారణం కాదని జస్టిస్ సంజీవ్ నారులా అన్నారు. మార్చి 18, 2024లో ఒక మహిళ తన అత్తగారింట్లో అసహజంగా మరణించింది. దీనిపై IPC సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం)తో పాటు సెక్షన్ 498A (క్రూరత్వం)/304-B (కట్నం మరణం) కింద అరెస్టు చేయబడిన వ్యక్తికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి, ఒక మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాడని తెలిపే వీడియోలు, చాట్ రికార్డులు ఉన్నాయి. ‘‘వ్యక్తికి వివాహేతర సంబంధం ఉందని భావించినప్పటికీ, అది మరణించిన వ్యక్తిని హింసించినట్లు, వేధించినట్లు చూపించకపోతే, ఆ వివాహేతర సంబంధం సెక్షన్ 498A IPC కింద క్రూరత్వం లేదా సెక్షన్ 306 IPC కింద ఆత్మహత్య ప్రేరేపణలకు కిందకు రాదని చట్టం తేల్చింది. ’’ అన కోర్టు పేర్కొంది.
‘‘వివాహేతర సంబంధం సెక్షన్ 304B IPC(వరకట్న వేధింపులతో మరణం) కింద నిందితుడిని ఇరికించడానికి కారణం కాదు. వేధింపులు లేదా క్రూరత్వానికి వరకట్న డిమాండ్లు కారణమని చూపించాలని కోర్టు చెప్పింది.’’ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి 2024 నుంచి కస్టడీలో ఉన్నాడని, అతడికి నిరంతర జైలు శిక్ష వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు ముగిసిన తర్వాత చార్జిషీట్ దాఖలైందని, విచారణ సమీప భవిష్యత్తులో ముగిసే అవకాశం లేదని, సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం కూడా లేదని గ్రహించిన కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అతనిని రూ. 50,000 వ్యక్తిగత బాండ్పై విడుదల చేయాలని ఆదేశించింది, అంతే మొత్తంలో ఇద్దరు పూచీకత్తులు కూడా చెల్లించాలని ఆదేశించింది.
భర్త సహోద్యోగితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని, ఇది తెలిసిన తర్వాత భార్యని వేధించాడని మహిళ కుటుంబం ఆరోపించింది. సదరు వ్యక్తి, భార్యని గృహహింసకు గురిచేస్తున్నాడని, అతను కారు కొనుగోలు చేసిన కారుకు, భార్య కుటుంబమే ఈఎంఐ చెల్లించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించింది. సదరు మహిళ, ఆమె కుటుంబం ఆమె జీవించినప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయలేదని కోర్టు గుర్తించింది.