పెరిగిపోతున్న వాయు కాలుష్యం.. 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్' ప్రారంభం

దేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతోంది.;

Update: 2023-10-23 10:54 GMT

దేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే అక్టోబర్ 26, గురువారం నుండి "రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్" ప్రచారం ప్రారంభమవుతుందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం తెలిపారు. బైక్‌లు గరిష్ట కాలుష్యానికి కారణమవుతున్నాయని, మోటార్‌సైకిల్‌దారులు తమ "కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్" (PUCలు) పొందాలని అభ్యర్థించారు.

రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని మెట్రో అధికారులను ఆదేశించామని, బస్సులకు కూడా అదే సూచనలు ఇచ్చామని రాయ్ తెలిపారు. దసరా సందర్భంగా దేశ రాజధానిలో బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ‘మనం ఏ పని చేసినా దాని ప్రభావం మనపైనే ఉంటుంది’ అని ఢిల్లీ వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సహకరించాలని ఆయన ఢిల్లీవాసులకు విజ్ఞప్తి చేశారు.

'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్' ప్రచారం నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడింది. ప్రజలు రెడ్ లైట్ల వద్ద వేచి ఉన్నప్పుడు ఇంజిన్‌లను ఆపివేయమని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం బేసి-సరి వాహనాల రేషన్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని రాయ్ తెలిపారు. బేసి-సరి వాహనాల రేషన్ పథకం కింద, బేసి సంఖ్యలతో ముగిసే రిజిస్ట్రేషన్ ప్లేట్‌లతో కూడిన ప్రైవేట్ వాహనాలు బేసి తేదీలలో మరియు సరి సంఖ్యలు సరి తేదీలలో తిరుగుతాయి.

ఇది కాకుండా, దేశ రాజధానిలో దుమ్ము కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం డస్ట్ సప్రెసెంట్ పౌడర్‌ను ఉపయోగించాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలను సమర్థవంతంగా అమలు చేసేందుకు మంత్రి 28 శాఖలతో సమావేశం నిర్వహించారు.

ఢిల్లీ గాలి నాణ్యత మే 17 తర్వాత మరింత క్షీణించింది. దాంతో దీన్ని అరికట్టే చర్యలు చేపట్టేందుకు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో మరో 8 కాలుష్య హాట్‌స్పాట్‌లను గుర్తించడంతో ప్రస్తుతం వాటి సంఖ్య 21కి పెరిగిందని ఆయన అన్నారు.

"ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న 13 వాయు కాలుష్య హాట్‌స్పాట్‌లతో పాటు, AQI 300-మార్క్‌ను అధిగమించిన ఎనిమిది ప్రదేశాలపై మేము దృష్టి పెడుతున్నాము. ఈ స్థానాల్లో షాదీపూర్, ITO, మందిర్ మార్గ్, నెహ్రూ నగర్, పట్పర్‌గంజ్, సోనియా విహార్, ధ్యాన్ చంద్ స్టేడియం, మోతీ బాగ్ ఉన్నాయని ఆయన తెలిపారు.

ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న కాలుష్య హాట్‌స్పాట్‌లు ఆనంద్ విహార్, ముండ్కా, వజీర్‌పూర్, జహంగీర్‌పురి, ఆర్‌కె పురం, రోహిణి, పంజాబీ బాగ్, ఓఖ్లా, బవానా, వివేక్ విహార్, నరేలా, అశోక్ విహార్ మరియు ద్వారక.

Tags:    

Similar News