India Republic Day: దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకులు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.;
భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం మరింత ప్రత్యేకంగా ఉండడంతో త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కఢ్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తదితరులు కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ‘స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్’ అనే థీమ్ తో శకటాలను రూపకల్పన చేయడం విశేషం. సైనిక సామర్థ్యాలను ప్రదర్శించే బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీబ్యారెల్ రాకెట్లు పెరేడ్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్య పథ్పై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. రిపబ్లిక్ డే పరేడ్ 9 కిలోమీటర్ల మేర రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు కొనసాగింది. ఈ పరేడ్లో 31 శకటాలు ప్రదర్శించబడ్డాయి. వాటిలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర శాఖలు, యూటీలకు చెందిన శకటాలు ఉన్నాయి. ఈ విధంగా భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ దేశంలోని సైనిక శక్తి, సాంస్కృతిక సంపదను ప్రదర్శించడమే కాకుండా, ప్రజలలో దేశభక్తి, ఐక్యతను మరింత పెంచుకునేలా చర్యలు చేపట్టింది.