నేవీ అమ్ములపొదిలిలోకి మరో బ్రహ్మాస్త్రం

దేశీయ తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహాంత్;

Update: 2024-08-30 01:00 GMT

అణ్వస్త్ర సామర్థ్యమున్న ‘ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌’ నేవీ అమ్ములపొదిలోకి చేరింది. ఏపీలోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో జలాంతర్గామిని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. భారత నౌకాదళంలో ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ రెండో అణు జలాంతర్గామి అని, దీని ప్రవేశంతో దేశ అణు సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందన్నారు.

పూర్తిగా అణు సామర్థ్యంతో దేశీయ తొలి బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌’ స్ఫూర్తి, డిజైన్, అనుభవంతో ‘ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌’ను భారత నౌకాదళం నిర్మించింది. అణుత్రయంలో అత్యంత కీలకమైన ఈ అణు జలాంతర్గామి నేవీ అమ్ములపొదిలోకి చేరేందుకు సిద్ధమైంది. శత్రుదేశాల్లోని సైనిక స్థావరాలు, అణువిద్యుత్‌ కేంద్రాలు, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేసే స్ట్రాటజిక్‌ క్షిపణులను నీటి అడుగు నుంచి ప్రయోగించే సామర్థ్యంతో ఈ జలాంతర్గామిని రూపొందించారు.

ఇండియన్ నేవీలో తొలి అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ చక్రను రష్యా నుంచి లీజుకు తీసుకున్నారు. అయితే, పదిహేనేళ్ల కిందట 2011 డిసెంబరులో భారత్ సొంతంగా న్యూక్లియర్ సబ్-మెరైన్‌ల నిర్మాణాన్ని చేపట్టింది. వాటిని తూర్పు నౌకాదళ కేంద్రం విశాఖలోని నేవీ షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన తొలి ఎస్‌ఎస్‌బీఎన్‌ (షిప్‌, సబ్‌మెర్సిబుల్‌, బాలిస్టిక్‌, న్యూక్లియర్‌) జలాంతర్గామి.. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌‌ 2018 నుంచి నేవీకి పూర్తిస్థాయి సేవలు అందిస్తోంది. ఆ డిజైన్‌, స్ఫూర్తితో దానికి మించిన శక్తితో ఐఎన్‌ఎస్ అరిఘాత్‌‌ను రూపొందించారు.

ఇప్పటికే పలుసార్లు దీనిని పరీక్షించి, కమిషనింగ్‌కు సిద్ధం చేశారు. అరిహంత్‌ క్లాస్‌ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌లో అరిఘాత్‌ రెండోది. ఇక, ఐఎన్ఎష్ అరిహంత్‌‌లో 750 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలిగే కె-15 క్షిపణులు ఉంటాయి. అరిఘాత్‌లో దానికి నాలుగు రెట్లు అంటే 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల నాలుగు కే-4 సబ్‌మెరైన్‌ లాంచ్‌డ్‌ బాలిస్టిక్‌ క్షిపణులు (ఎస్ఎస్ఎబీఎన్) లేదా సంప్రదాయ/ స్ట్రాటజిక్‌ అణువార్‌హెడ్లను మోసుకెళ్లగల 12 కే-15 ఎస్‌ఎల్‌బీఎంలను దీనికి అమర్చవచ్చు. 

3500 కి.మీ. అంటే బంగాళాఖాతం ఉత్తర భాగం నుంచి ప్రయోగిస్తే చైనా రాజధాని బీజింగ్‌ కూడా దీని పరిధిలోకి వస్తుంది. 83 మెగావాట్ల ప్రెజరైజ్డ్‌ లైట్ వాటర్‌ రియాక్టర్‌తో పనిచేసే ఏడు బ్లేడ్‌ల ప్రొపెల్లర్‌ ఉండే ఈ అణు జలాంతర్గామి.. సముద్ర ఉపరితలంపై గంటకు 12 నుంచి 15 నాటికల్‌ మైళ్ల (22-28 కి.మీ) వేగంతో ప్రయాణిస్తుంది. అదే లోపల దీని వేగం గంటకు 24 నాటికల్‌ మైళ్ల (44 కిలోమీటర్ల) ఉంటుంది. ఇందులోని అమర్చిన క్షిపణులను డీఆర్‌డీవో రూపొందించింది. కాగా, ఈ సిరీ‌స్‌లోని మూడో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అర్ధిమాన్‌ కూడా వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.  

Tags:    

Similar News