INS Tabar: గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో ఆయిల్ ట్యాంకర్ నౌకకు ప్రమాదం... కాపాడిన నేవీ
ప్రమాద సమయంలో ట్యాంకర్లో 14 మంది భారతీయ సిబ్బంది;
గల్ఫ్ ఆఫ్ ఒమన్లో భారీ అగ్నిప్రమాదానికి గురైన ఒక ఆయిల్ ట్యాంకర్కు భారత నౌకాదళం అండగా నిలిచింది. ప్రమాదంలో చిక్కుకున్న 14 మంది భారతీయ సిబ్బందిని రక్షించేందుకు వేగంగా స్పందించి, సహాయక చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో ఉన్న ఐఎన్ఎస్ తబార్ నౌక, అత్యవసర సందేశం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది.
వివరాల్లోకి వెళ్తే, పలావు దేశానికి చెందిన 'ఎంటీ యీ చెంగ్ 6' అనే ఆయిల్ ట్యాంకర్, భారత్లోని కాండ్లా పోర్టు నుంచి ఒమన్లోని షినాస్కు బయలుదేరింది. ఈ నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ప్రయాణిస్తుండగా నిన్న దాని ఇంజిన్ రూమ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదం కారణంగా నౌకలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ట్యాంకర్ సముద్రంలో నిస్సహాయ స్థితిలో ఆగిపోయింది. ఆ సమయంలో ట్యాంకర్లో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.
ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ట్యాంకర్ సిబ్బంది అత్యవసర సహాయం కోసం సందేశాలు పంపారు. అదే సమయంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్లో మిషన్లో ఉన్న భారత నౌకాదళానికి చెందిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తబార్కు ఈ సమాచారం అందింది. ప్రమాద తీవ్రతను గ్రహించిన ఐఎన్ఎస్ తబార్ సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ట్యాంకర్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు.
ఈ ఘటనపై భారత నౌకాదళం అధికారికంగా స్పందించింది. "గల్ఫ్ ఆఫ్ ఒమన్లో విధుల్లో ఉన్న మా ఐఎన్ఎస్ తబార్ నౌక నిన్న ఎంటీ యీ చెంగ్ 6 నుంచి వచ్చిన అత్యవసర సందేశానికి స్పందించింది" అని నేవీ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. భారత్ నుంచి ఒమన్ వెళ్తున్న ఈ నౌకలో 14 మంది భారత సిబ్బంది ఉన్నారని, ఇంజిన్ రూమ్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని వివరించింది. ఐఎన్ఎస్ తబార్ నౌక సకాలంలో స్పందించి, ట్యాంకర్లోని సిబ్బందికి అవసరమైన సహాయాన్ని అందించిందని వెల్లడించింది.