Ashwini Vaishnaw: రైలు ప్రయాణికులకు అదిరిపోయే సదుపాయం.
ఇకపై బుక్ అయిన టికెట్ల ప్రయాణ తేదీని మార్చుకునే సౌలభ్యం
భారతీయ రైల్వే ఒక కీలకమైన మార్పునకు శ్రీకారం చుట్టింది. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో టికెట్పై 'జర్నీ డేట్' మార్చుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు బుక్ చేసిన టికెట్ను రద్దు చేసి కొత్త టికెట్ను తీసుకోవాల్సిన పరిస్థితి ఉండగా, వచ్చే జనవరి నెల నుంచి ప్రయాణికులు ఆన్లైన్లోనే తాము బుక్ చేసుకున్న టికెట్పై ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం పొందనున్నారు.
ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని అన్యాయమైనదిగా అభివర్ణించిన ఆయన.. “ఇది ప్రయాణికుల ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. కొత్త విధానం ద్వారా ప్రయాణికుల ఇబ్బందులు తగ్గబోతున్నాయి,” అని తెలిపారు.
కొత్త విధానంలోని ముఖ్యాంశాలు:
* ఎలాంటి రద్దు లేకుండా ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం
* మార్పు కోసం ఎలాంటి అదనపు రుసుము ఉండదు
* ఆన్లైన్లోనే తేదీ మార్పు సౌలభ్యం
* మార్చుకోవాలనుకునే తేదీలో సీట్లు ఖాళీగా ఉండాలి
* కొత్త టికెట్ ధర ఎక్కువైతే, వ్యత్యాసాన్ని ప్రయాణికుడే భరించాలి
ప్రస్తుతం ఉన్న విధానం:
* ప్రస్తుత పరిస్థితిలో కన్ఫర్మ్ చేసుకున్న టికెట్పై ప్రయాణ తేదీ మార్చుకోవడం సాధ్యం కాదు
* ప్రయాణికులు టికెట్ను రద్దు చేసి, మళ్లీ కొత్త టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది
* రైలు బయలుదేరే సమయానికి బట్టి రీఫండ్ మొత్తంలో తగ్గింపులు ఉంటాయి
* 48 గంటల ముందు రద్దు చేస్తే 25శాతం ఛార్జ్ మినహాయించి మిగతా డబ్బు తిరిగి వస్తుంది
* 12 గంటల ముందు రద్దు చేస్తే ఛార్జీలు పెరుగుతాయి
* రిజర్వేషన్ చార్ట్ వచ్చిన తర్వాత టికెట్ రద్దు చేస్తే రీఫండ్ ఉండదు