Richest Beggar: బిచ్చగాడు కాదు.. కోటీశ్వరుడు!.. ఆస్తులు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే!
మూడు ఇళ్లు, మూడు ఆటోలు, కారు ఉన్నట్టు వెల్లడి
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఒక దివ్యాంగ యాచకుడిని చూసి అందరూ జాలిపడతారు. కానీ, అతని అసలు స్వరూపం తెలిసి అధికారులు నివ్వెరపోయారు. చక్రాల బండిపై కదులుతూ భిక్షాటన చేసే మంగీలాల్ అనే ఆ వ్యక్తి ఒక కోటీశ్వరుడని తేలింది. మూడు ఇళ్లు, మూడు ఆటోలు, ఒక కారుకు యజమాని అయిన అతను, యాచక నిర్మూలన డ్రైవ్లో పట్టుబడటంతో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇండోర్లోని రద్దీగా ఉండే సరాఫా బజార్లో మంగీలాల్ రోజూ కనిపిస్తాడు. బాల్ బేరింగ్ చక్రాలున్న ఇనుప బండిపై కూర్చుని, చేతులకు బూట్లు తొడుక్కుని తనను తాను తోసుకుంటూ వెళతాడు. ఎవరినీ చేయి చాచి అడగడు. కానీ, అతని పరిస్థితి చూసి జాలిపడిన బాటసారులు నాణేలు, నోట్లు వేస్తుంటారు. ఇలా రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు సంపాదించేవాడు.
అయితే, అసలు కథ రాత్రిపూట మొదలయ్యేది. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును మంగీలాల్ తన ఖర్చులకు కాకుండా, మళ్లీ సరాఫా బజార్లోనే పెట్టుబడిగా పెట్టేవాడు. స్థానిక వ్యాపారులకు రోజు లేదా వారానికి అప్పుగా ఇచ్చి, అధిక వడ్డీ వసూలు చేసేవాడు. ఈ వడ్డీని వసూలు చేసేందుకే రోజూ సాయంత్రం బజార్కు వచ్చేవాడు. వడ్డీ రూపంలోనే అతనికి రోజుకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఆదాయం వచ్చేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన సుమారు రూ.4-5 లక్షల వరకు అప్పులు ఇచ్చినట్టు భావిస్తున్నారు.
మంగీలాల్ ఆస్తుల వివరాలు తెలిసి అధికారులు షాక్!
విచారణలో మంగీలాల్ ఆస్తుల వివరాలు విని అధికారులు అవాక్కయ్యారు. అతనికి నగరంలోని మంచి ప్రాంతాల్లో మూడు ఇళ్లు ఉన్నాయి. అందులో ఒకటి మూడంతస్తుల భవనం కాగా, మిగిలినవి రెండు సాధారణ ఇళ్లు. వీటితో పాటు మూడు ఆటో-రిక్షాలను అద్దెకు తిప్పుతున్నాడు. అతనికి ఒక మారుతీ సుజుకీ డిజైర్ కారు కూడా ఉంది. ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ, దివ్యాంగుడు కావడంతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ప్రభుత్వం అతనికి ఒక 1బీహెచ్కే ఇల్లు కూడా కేటాయించడం గమనార్హం.
ఈ ఆపరేషన్కు నేతృత్వం వహించిన మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారి దినేశ్ మిశ్రా ఈ వివరాలను ధృవీకరించారు. మంగీలాల్ 2021-22 నుంచి భిక్షాటన చేస్తున్నాడని, అతడిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం అతన్ని ఉజ్జయినిలోని సేవాధామ్ ఆశ్రమానికి తరలించామని, అతని ఆస్తులు, బ్యాంకు ఖాతాలపై లోతైన విచారణ జరుపుతున్నామని చెప్పారు. అతడి వద్ద అప్పు తీసుకున్న వ్యాపారులను కూడా ప్రశ్నిస్తామని మిశ్రా వివరించారు. ఈ ఘటన ఇండోర్లో కొనసాగుతున్న యాచక నిర్మూలన ప్రచారంలో ఒక అనూహ్య పరిణామంగా నిలిచింది.