Basmati Exports : ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్

రేవుల్లో నిలిచిపోయిన లక్ష టన్నుల బియ్యం రూ.2,000 కోట్ల చెల్లింపుల పైనా ప్రభావం

Update: 2026-01-10 05:45 GMT

అణు, క్షిపణి కార్యక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘనలతో పాటు ప్రాంతీయ అస్థిరతకు ఇరాన్ మద్దతు ఇస్తోందనే ఆరోపణలతో అమెరికా, ఐక్యరాజ్య సమితి, పశ్చిమ దేశాలు టెహ్రాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించాయి. ఈ ఆర్థిక ఆంక్షల వల్ల చమురు ఎగుమతులు దెబ్బతిని, రియల్‌ కరెన్సీ పడిపోయి 40 శాతం ద్రవ్యోల్బణంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతులకు మరోసారి అనిశ్చితి ఏర్పడింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని బాస్మతి బియ్యం రైతులు, రైస్ మిల్లర్లపై ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే, అమెరికా ఆంక్షలు మరింత కఠినం అవ్వడంతో, ఇరానియన్ కరెన్సీ రియల్ విలువ భారీగా పతనం కావడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారింది. కాగా, ఇరాన్ రియల్ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరుకోవడంతో, ఆహార దిగుమతులపై ఇప్పటి వరకు కొనసాగుతున్న సబ్సిడీలను ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. దీంతో భారతీయ ఎగుమతిదారులు సరుకులను పంపేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా కనీసం రూ.2,000 కోట్ల విలువైన బాస్మతి బియ్యం అంతర్జాతీయ పోర్టుల్లోనే నిలిచిపోయింది.

 ఇంతకు ముందు భారత్- ఇరాన్ మధ్య వాణిజ్యం బార్టర్ విధానంలో (వస్తువుల మార్పిడి ద్వారా) సాగేది.. అయితే భారత్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిపివేయడంతో ఆ విధానం కూడా ఆగిపోయింది. అయినప్పటికీ, టీ, బాస్మతి బియ్యం, ఔషధాలు లాంటి ఆహార ఉత్పత్తులను భారత్ నుంచి ఇరాన్ దిగుమతి చేసుకుంటుంది. కానీ, తాజా పరిస్థితులతో ఈ దిగుమతులు కూడా తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది.

ఇరాన్ అనేది భారత బాస్మతి బియ్యానికి అతిపెద్ద దిగుమతిదారుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం సగటున 12 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని, సుమారు రూ.12,000 కోట్ల విలువకు ఇరాన్ దిగుమతి చేసుకుంటుంది. ఇందులో దాదాపు 40 శాతం పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచే సరఫరా అవుతుంది. కాగా, ఎగుమతుల్లో ఇలాగే అనిశ్చితి కొనసాగితే, ఇప్పటికే మిల్లర్లు నష్టాలను ఎదుర్కొంటుండగా, రాబోయే రోజుల్లో రైతులకు లభించే ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరెన్సీ పతనం ఎఫెక్ట్

ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు డాలర్‌కు సుమారు 90,000 రియల్ మారకం రేటు ఉండేది. ప్రస్తుతం అది 1,50,000కు చేరుకోవడంతో, ఇరాన్‌కు దిగుమతులు చాలా ఖరీదు అయ్యాయి. ఇంతకు ముందు ఆహార దిగుమతుల కోసం ఇరాన్ ప్రభుత్వం డాలర్‌కు 28,500 రియల్ ప్రిఫరెన్షియల్ రేటును అందించేది. కానీ ఈ సౌకర్యాన్ని ఇప్పుడు పూర్తిగా ఉపసంహరించుకుంది. అయితే, ఇరాన్ సాధారణంగా జూన్ 21 తర్వాత విదేశీ దిగుమతులను నిలిపివేసి, సెప్టెంబర్‌లో మళ్లీ ప్రారంభిస్తుంది. ఈ మధ్యకాలంలో భారత ఎగుమతిదారులు మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకునే వాళ్లు.. కానీ, ప్రస్తుతం ఇరాన్ లో అనిశ్చితి వల్ల ఈ సరఫరా చక్రం పూర్తిగా ఆగిపోయింది.

Similar News