Jaipur: రాజస్థాన్లోని ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఆరుగురు రోగులు సజీవ దహనం
ట్రామా ఐసీయూలో చెలరేగిన మంటలు, రోగులు దుర్మరణం
రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న సవాయ్ మాన్సింగ్ (ఎస్ఎంఎస్) ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలోని ట్రామా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
ఆస్పత్రి ట్రామా సెంటర్ ఇన్చార్జ్ డాక్టర్ అనురాగ్ ధాకడ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ట్రామా సెంటర్లోని రెండో అంతస్తులో ఉన్న ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని ఆయన తెలిపారు. చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించి, వార్డు మొత్తం విషపూరిత పొగతో నిండిపోయిందని వివరించారు.
ప్రమాదం జరిగిన సమయంలో ట్రామా ఐసీయూలో 11 మంది, దాని పక్కనే ఉన్న సెమీ-ఐసీయూలో 13 మంది, మొత్తం కలిపి 24 మంది రోగులు చికిత్స పొందుతున్నారని డాక్టర్ అనురాగ్ చెప్పారు. వారిలో చాలామంది కోమాలో ఉన్నారని పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే తమ సిబ్బంది, నర్సింగ్ అధికారులు, వార్డ్ బాయ్లు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని అన్నారు.
"మా సిబ్బంది వెంటనే రోగులను ట్రాలీలపై బయటకు తీసుకువచ్చి మరో సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, వారికి సీపీఆర్ చేసి బతికించడానికి తీవ్రంగా ప్రయత్నించాం. కానీ, మా ప్రయత్నాలు ఫలించలేదు" అని డాక్టర్ అనురాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిలో మరో ఐదుగురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.