Hemant Soren : వేడెక్కుతున్న ఝార్ఖండ్ రాజకీయాలు.. సీఎం హేమంత్ సోరేన్ పై అనర్హత వేటు తప్పదా..?
Hemant Soren : బీహార్లో రాజకీయ పరిణామాలు మారిన కొద్ది రోజులకే ఝార్ఖండ్లో పొలిటికల్ హీట్ పెరిగింది;
Jharkhand Political Crisis : బీహార్లో రాజకీయ పరిణామాలు మారిన కొద్ది రోజులకే ఝార్ఖండ్లో పొలిటికల్ హీట్ పెరిగింది.సీఎం హేమంత్ సోరెన్ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం గవర్నరుకు సిఫారసు చేసినట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈసీ రికమెండ్ చేసిందన్న వార్త రాంచీ సర్కిల్స్లో తెగ చెక్కర్లు కొడుతుంది.గనుల లీజు వ్యవహారంలో సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారని..ఆయనపై అనర్హత వేటు వేయాలని బీజేపీ గతంలో చేసిన కంప్లైంట్ పై స్పందించిన ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.గవర్నర్ రమేశ్ బైస్కు ఈసీ నుంచి లేఖ అందినట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో అటు రాజ్భవన్ కానీ, ఇటు గవర్నర్ కానీ దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. హేమంత్ సోరెన్ కూడా ఈ వార్తలను ఖండించారు. రాజ్యాంగ వ్యవస్థలను కొనగలరేమో కానీ, ప్రజల మద్దతును కొనలేరంటూ కేంద్రంపై పరోక్ష విమర్శలు చేశారు.
ఇక గనుల శాఖ బాధ్యతలనూ చూస్తున్న సోరెన్ తన కోసం స్వయంగా ఒక లీజు మంజూరు చేసుకోవడంతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీజేపీ నేత ఫిర్యాదు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 9ఏ ప్రకారం..చట్ట సభల్లో సభ్యుడిగా ఉన్నవారు ప్రభుత్వ కాంట్రాక్టులు పొందకూడదు.దీన్ని ఉల్లంఘించారు కాబట్టి హేమంత్పై అనర్హత వేటు వేయాలని ఝార్ఖండ్ మాజీ సీఎం గత 18వ తేదిన గవర్నర్ను కోరారు. అయితే ఈసీ అభిప్రాయాన్ని గవర్నరు కోరారు. ఈసీ తన అభిప్రాయాన్ని గవర్నర్కు పంపారన్న వార్త రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. అయితే గవర్నర్ రమేష్ బైస్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
మరోవైపు తనపై అనర్హత వేటుకు ఈసీ గ్రీన్సిగ్నల్ ఇచ్చిందన్న వార్తలపై హేంమంత్ సోరెన్ సీరియ్సగా స్పందించారు.తన ఎలాంటి సమాచారం లేదని, సీఎంవోకు కూడా రాజ్భవన్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని. అది పూర్తిగా బీజేపీ కల్పించిన నివేదిక అని మండిపడ్డారు.అయితే బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఈసీఐ నుంచి లేఖ రాజ్భవన్కు చేరిందని.సోరెన్పై అనర్హత ఈ నెలలోనే ఉంటుందంటూ ఓ ట్వీట్ చేశారు. అయితే సోరెన్పై అనర్హత వేటు వేసినా ఝార్ఖండ్లోని యూపీఏ సర్కారుకు ఢోకా లేదని కాంగ్రెస్ నేత,మంత్రి అలంగీర్ ఆలమ్ అన్నారు. 81 సభ్యుల అసెంబ్లీలో విపక్ష బీజేపీకి 28 మంది సభ్యులున్నారు. ఈసీ నిర్ణయం ఏదైనా స్వాగతిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్రలు మొదలుపెట్టిందని జేఎంఎం నేతలు మండిపడుతున్నారు.