Junior Doctors Protest : పతాక స్థాయికి చేరిన వైద్యుల ఆమరణ దీక్ష
9వ రోజుకు చేరిన ఆమరణ నిరాహార దీక్ష;
కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన పతాక స్థాయికి చేరింది. ఆమరణ నిరాహార దీక్ష సోమవారానికి పదో రోజుకు చేరింది. కోల్కతా, సిలిగురి నగరాల్లో ముగ్గురు జూనియర్ డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమ ఆందోళనపై సీఎం మమతా బెనర్జీ స్పందించటం లేదని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల సామూహిక రాజీనామాలను మమత సర్కార్ తిరస్కరించింది.
పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన పతాక స్థాయికి చేరుకుంది. వారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం 9వ రోజుకు చేరుకుంది. కోల్కతా, సిలిగురి నగరాల్లో ముగ్గురు జూనియర్ డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమ ఆందోళనపై సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కార్ స్పందించటం లేదని నిరసన చేపట్టిన వైద్యులు ఆరోపించారు.
ఆందోళన చేస్తున్న జూడాలు ఆదివారం ‘ఆరంధన్’ (వంట వద్దు)కు పిలుపునివ్వగా, రాష్ట్రంలో పలుచోట్ల వారికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. వైద్యుల నిరసనకు సంఘీభావం తెలుపుతూ, 12 గంటలపాటు నిరాహార దీక్షను పాటించారు. ఆర్జీ కర్ దవాఖాన వైద్యులు సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేస్తున్న వందలాది మంది వైద్యులు జూనియర్ డాక్టర్ల దీక్షకు తమ మద్దతు ప్రకటించారు. తాజాగా మరో 77 మంది వైద్యులు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు. అయితే వైద్యుల సామూహిక రాజీనామాలను మమత సర్కార్ తిరస్కరించింది. సామూహిక రాజీనామాల్ని ఆమోదించటం లేదని సీఎం ముఖ్య సలహాదారు అలపాన్ బందోపాధ్యాయ తెలిపారు.
సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా దవాఖానల్లో ఎంపిక చేసిన సేవలను షట్ డౌన్ చేయాలని ది ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్(ఫైమా) పిలుపునిచ్చింది. అయితే ఎమర్జెన్సీ సేవలను మాత్రం కొనసాగించాలని ఆ సంఘం రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్లను కోరింది. జూనియర్ డాక్టర్ట దీక్షకు ఫైమా మద్దతు ప్రకటించగా, ఈ నెల 15న ఒక రోజు దేశవ్యాప్త నిరాహార దీక్షకు ఐఎంఎ పిలుపునిచ్చింది.