Train Accident : కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం.. అసలు కారణం ఇదే
రైల్వే బోర్డు చైర్మన్ ఏం చెప్పారంటే..;
పశ్చిబ బెంగాల్ రాష్ట్రం దార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్ కతాలోని సిల్దాకు బయలుదేరిన కాంచనజంగా ఎక్స్ప్రెస్ న్యూజల్ పాయ్ గుడి వద్ద కొద్దిసేపు ఆగింది. కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్ రైలు వేగంగా వచ్చి కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ గాల్లోకిలేచిపడింది. గూడ్స్ రైలు బోగీలు కూడా చెల్లాచెదురు అయ్యాయి. రైల్వే పోలీసులు, రెస్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతిచెందగా.. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు లోకో పైలట్లు కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు గార్డు కూడా ఉన్నాడు.
ఈ ప్రమాద ఘటనపై రైల్వే బోర్డు చైర్మన్ జయవర్మ సిన్హా మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాన్ని వెల్లడించారు. గూడ్స్ రైలు డ్రైవర్ (లోకో పైలట్) తప్పిదం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని తెలిపారు. గూడ్స్ రైలు డ్రైవర్ సిగ్నల్ ను పట్టించుకోకుండా రైలును పోనివ్వడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.
కాంచన్జంగ రైలు దుర్ఘటన నేపథ్యంలో ‘కవచ్’ టెక్నాలజీ మరోసారి చర్చనీయాంశమైంది. ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు ప్రమాదాలను నివారించేందుకు ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థే ‘కవచ్’. అయితే, ఈ కవచ్ వ్యవస్థ ఈ మార్గంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ రైలు ప్రమాదం ఘటనలో సిగ్నలింగ్ వైఫల్యం కన్పించింది. ప్రమాదం జరిగిన రాణిపత్ర రైల్వే స్టేషన్, చట్టర్ హట్ జంక్షన్ మధ్య ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ సోమవారం ఉదయం 5.50 గంటల నుంచి పని చేయలేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
ప్రమాదానికి గురైన రైలులో త్రిపుర వాసులు ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సాధ్యమైనంత వరకు సహాయం అందించడం కోసం ప్రమాద స్థలికి సహాయక బృందాన్ని పంపింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఫోన్ చేసిన త్రిపుర సీఎం మాణిక్ సాహా ఈ ప్రమాద వివరాలను ఆరా తీశారు.
ఇదిలాఉంటే .. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ. 50,000 ఎక్స్గ్రేషియా మొత్తాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. మరోవైపు రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్ర మంత్రి రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5లక్షలు పరిహారం ప్రకటించారు.