Bengaluru Stampede: విజయోత్సవంలో విషాదం, 11 మంది మృతి , 50 మందికి తీవ్ర గాయాలు
సీఎం సిద్ధరామయ్య బాధ్యతారహిత వ్యాఖ్యలు;
పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా, సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ముందు జాగత్తగా తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ స్థాయిలో క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. పాసులు, టికెట్లు ఉన్న వారినే లోపలకు అనుమతించాల్సి ఉన్నప్పటికీ తమ ఆర్సీబీ హీరోలను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో స్టేడియం ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. స్టేడియం ప్రాంగణంలో డ్రైనేజ్పై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్లాబుపై అభిమానులు నిలబడడంతో బరువును తట్టుకోలేక స్లాబు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హఠాత్తుగా స్లాబు కూలిపోవడంతో ప్రజలు భయకంపితులై అక్కడ నుంచి పరుగులు తీసే క్రమంలో తొక్కిసలాట జరిగినట్లు పేర్కొన్నాయి.
తొక్కిసలాట ఘటనపై సీఎం సిద్ధరామయ్య బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని చెప్పారు. ‘ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఇంతకంటే దారుణమైనవి చోటుచేసుకున్నాయి. కుంభమేళాలోనూ తొక్కిసలాట జరిగింది. 50-60 మంది చనిపోయారు. నేను ఘటనను సమర్థించడం లేదు. జరిగిందంతే’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో 11 మంది మరణించినట్లు వెల్లడించారు. ఘటనపై డిప్యుటీ కమిషనర్ స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందజేయనున్నట్లు తెలిపారు.
తొక్కిసలాటలో ప్రాణనష్టం జరిగినట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ధ్రువీకరించారు. అయితే ఇతర వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ఎందరు మరణించాన్న విషయాన్ని తాను నిర్ధారించలేనని ఆయన ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ చెప్పారు. భద్రతా ఏర్పాట్ల కోసం 1,000 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని డీకే తెలిపారు. తొక్కిసలాట, మరణాల కారణంగా కార్యక్రమాన్ని 10-15 నిమిషాల్లో ముగించి వేశామని ఆయన చెప్పారు. మృతులలో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, మహిళలు ఉన్నారు. బౌరింగ్ దవాఖానలో ఆరుగురు మరణించినట్లు ధ్రువీకరించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వైదేహి దవాఖానలో నలుగురు, మణిపాల్ దవాఖానలో ఒకరు మరణించినట్లు తెలుస్తోంది.