Karntaka: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..ఎలా చంపిందంటే
కళ్లలో కారం కొట్టి.. మెడపై కాలు పెట్టి..;
అక్రమ సంబంధాలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ప్రియుడిపై మోజుతో వివాహిత మహిళలు తమ భర్తలను కడతేరుస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మేఘాలయ హనీమూన్ మర్డర్ ఘటన మరువకముందే గద్వాలలో పెండ్లయిన నెలకే ఐశ్వర్య అనే మహిళ భర్తను చంపిన విషయం తెలిసిందే. తాజాగా, కర్ణాటకలో కూడా ఇలాంటి ఘోరమే మరొకటి జరిగింది. తమ వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్త కళ్లలో కారం చల్లి, మెడపై కాలుపెట్టి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత అతని మృతదేహాన్ని 30 కిలోమీటర్ల దూరంలో పారేసింది.
కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన సుమంగళ, శంకరమూర్తి (50) భార్యాభర్తలు. సుమంగళ తిప్పూర్లోని కల్పతరులో ఉన్న బాలికల హాస్టల్లో వంటమనిషిగా పనిచేస్తున్నది. దీంతో శకంరమూర్తి ఓ ఫామ్హౌస్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. కాగా, తాను పనిచేస్తున్న చోట కరదలుసంటే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో సుమంగళకు పరిచయమైంది. అదికాస్తా అక్రమసంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో శంకరమూర్తి తమకు అడ్డుగా ఉన్నాడని భావించిన సుమంగళ, నాగరాజు.. అతడిని చంపాలని నిశ్చయించుకున్నారు.
దీంతో ఈ నెల 24న తుమకూరు జిల్లాలోని తిప్తూరు తాలుకాలోని కడశెట్టిహళ్లీ గ్రామంలో ఉన్న శంకరమూర్తి వద్దకు వెళ్లిన సుమంగళ.. భర్త కళ్లలో కారం పొడి చల్లి కర్రతో కొట్టింది. అనంతరం అతని మెడపై కాలుతో తొక్కి చంపేసింది. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత ప్రియుడితో కలిసి అతని మృతదేహాన్ని ఓ గోనె సంచిలో కుక్కి.. గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలోని దండనిశివర పోలీస్ స్టేసన్ పరిధిలోని ఓ పొలంలో ఉన్న బావిలో పడేశారు.
కాగా, శంకరమూర్తి కనిపించకుండా పోవడంతో నోనవినకెరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది. దర్యాప్తులో భాగంగా మృతుడి మంచంపై కారం పొడి ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు.. సుమంగళను తమదైన శైలిలో విచారించడంతోపాటు, ఆమె ఫోన్ కాల్ డేటాను చెక్ చేయడంతో హత్య కుట్ర బయటపడింది.