ED: ఈడీ విచారణకు రెడీ.. కానీ

మార్చి 12 తర్వాతే ఈడీ ఎదుట హాజరవుతాన్న కేజ్రీవాల్‌... మరోసారి విచారణకు డుమ్మా

Update: 2024-03-04 04:30 GMT

మద్యం కుంభకోణం కేసులో కొంతకాలంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ED సమన్లను తిరస్కరిస్తూ వస్తోన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఎట్టకేలకు విచారణకు హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే, మార్చి 12 తర్వాతే తాను ఈడీ ఎదుట హాజరవుతానని తాజా సమన్లకు ఇచ్చిన సమాధానంలో కేజ్రీవాల్‌ పేర్కొన్నట్లు దిల్లీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో విచారణ నిమిత్తం మార్చి 4న రావాలని ఇటీవల కేజ్రీవాల్‌కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు జారీ చేసింది. ఈసారీ గైర్హాజరైన సీఎం.. ఈడీకి తన సమాధానం పంపారు. దర్యాప్తు సంస్థ సమన్లు చట్ట విరుద్ధమని మరోసారి ఆరోపించారు. అయినప్పటికీ వారి ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, మార్చి 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరవుతానని అన్నట్లు దిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


మద్యం పాలసీలో అవకతవకలకు సంబంధించి ఈడీ ఇప్పటివరకూ ఎనిమిది సార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరవ్వాలని కోరింది. కానీ, ఈ నోటీసులు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమైనవి అంటూ కేజ్రీవాల్ విచారణకు హాజరయ్యేందుకు నిరాకరిస్తూ వస్తున్నారు. ఈడీ తాజాగా ఫిబ్రవరి 27న మళ్లీ నోటీసులు జారీ చేసింది. మార్చి 4న తమముందు హాజరు రావాలని పేర్కొంది. దీనిపై స్పందించిన ఆప్ మార్చి 12 తరువాత కేజ్రీవాల్ విచారణకు వస్తారని తెలిపింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరవుతారని చెప్పింది. అయితే, వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఈడీ పట్టుబడుతోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు నిబంధనలు అనుమతించవని చెబుతోంది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. లంచాలు చేతులుమారడం, మద్యం పాలసీలో తప్పులు తదితర అంశాలపై కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు ఆప్ సీనియర్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను గతేడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్టు చేయగా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఈడీ అక్టోబర్‌‌లో అరెస్టు చేసింది. ఫిబ్రవరి 22వ తేదీన, గతంలో న‌వంబ‌ర్ 2న‌, డిసెంబ‌ర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్‌ ప‌ట్టించుకోలేదు. దీంతో జనవరి 31, ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఈడీ నోటీసులు పంపింది. అయితే, అప్పుడు కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. పైగా ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు.

Tags:    

Similar News