Mallikarjun Kharge: బడ్జెట్పై ఖర్గే విమర్శలు..కేంద్ర ప్రభుత్వానికి ఆలోచనలు కరవయ్యాయన్న కాంగ్రెస్ అధ్యక్షుడు
దీటుగా బదులిచ్చిన బీజేపీ
కేంద్ర బడ్జెట్ 2026-27పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన తీవ్ర విమర్శలకు బీజేపీ సోమవారం గట్టిగా బదులిచ్చింది. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాను, ప్రపంచ ఆర్థిక వాస్తవాలను కాంగ్రెస్ విస్మరిస్తోందని కమలం పార్టీ అధికార ప్రతినిధి ప్రతుల్ షా డియో మండిపడ్డారు.
ఈ సందర్భంగా ప్రతుల్ షా మాట్లాడుతూ, "వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రధాని మోదీకి స్పష్టమైన దార్శనికత ఉంది. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పింది. ద్రవ్య లోటు ఎప్పుడూ అదుపులో ఉండేది కాదు. ఈసారి ద్రవ్య లోటు కేవలం 4.3 శాతంగా ఉంది" అని గుర్తుచేశారు. ప్రభుత్వానికి విధానపరమైన దృష్టి లేదన్న ఖర్గే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలో ఉన్నప్పటికీ, భారత్ ఒక ప్రకాశవంతమైన శక్తిగా నిలుస్తోందని, బడ్జెట్ అన్ని కీలక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చిందని వివరించారు.
అంతకుముందు ఆదివారం, కేంద్ర ప్రభుత్వానికి ఆలోచనలు కరవయ్యాయని ఖర్గే విమర్శించారు. ఉద్యోగాలు, తయారీ రంగం, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలకు బడ్జెట్లో ఎలాంటి పరిష్కారాలు చూపలేదని ఆయన 'ఎక్స్' వేదికగా ఆరోపించారు. ఎగుమతుల క్షీణత, వాణిజ్య లోటు వంటి అంశాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించలేదని అన్నారు.
ఖర్గే ఆరోపణలను తిప్పికొడుతూ, దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం అత్యవసరమని ప్రతుల్ షా అన్నారు. "ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సాయుధ బలగాలు పాకిస్థాన్లోకి వెళ్లి తమ పరాక్రమాన్ని చూపాయి. సరిహద్దుల్లో శత్రుదేశాల నుంచి ముప్పు ఉన్నందున మనం సన్నద్ధంగా ఉండాలి" అని తెలిపారు. ఆర్థిక వివేకం, వృద్ధి, జాతీయ భద్రతకు సమ ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ రూపొందించామని, కాంగ్రెస్ కేవలం రాజకీయ కారణాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ ఆరోపించింది.