Manorama Khedkar: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి అరెస్టు
తుపాకితో రైతులను బెదిరించిన మనోరమ వీడియో వైరల్;
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ను పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుపాకితో ఆమె రైతులను బెదిరిస్తున్న వీడియో ఒకటి ఇటీవల బాగా వైరల్ అయింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాయ్గడ్లోని ఓ హోటల్లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మనోరమను అదుపులోకి తీసుకున్న మూడు పోలీసులు బృందాలు ఆమెను పూణేకు తరలిస్తున్నాయి.
అడ్డగోలుగా అధికార దుర్వినియోగంతో ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్ అరెస్టయ్యారు. అక్రమంగా ఆయుధాలు కలిగిఉన్నారన్న ఆరోపణల కింద ఆమెను గురువారం పుణె పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిరోజులుగా పూజాపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో కొందరు గ్రామస్థులను మనోరమ పిస్తోల్తో బెదిరిస్తున్నట్లున్న వీడియో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ వీడియో వైరల్గా మారింది. పుణెలోని ముల్షి తహసీల్ పరిధిలోని ధద్వాలి గ్రామంలో భూవివాదం విషయంలో ఆమె తన సెక్యూరిటీ గార్డులతో కలిసి తుపాకీతో బెదిరింపులకు దిగినట్లు ఆ దృశ్యాల్లో కనిపించింది. ఈ వ్యవహారంలో ఖేడ్కర్ దంపతులతో పాటు మరో ఐదుగురిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు పిలిచినా ఆ దంపతులు రాలేదని, మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేశారని తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇటీవల పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో వారికి చిక్కుకుండా తప్పించుకున్న ఆమెను రాయ్గఢ్లోని ఓ లాడ్జ్ నుంచి అదుపులోకి తీసుకున్నారు.
పూజ తండ్రి దిలీప్ ఖేడ్కర్పై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారిగా ఉన్న సమయంలో రెండుసార్లు సస్సెన్షన్కు గురయ్యారు. ఇదిలా ఉంటే.. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ పై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె ట్రైనింగ్ను నిలుపుదల చేసి తిరిగి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కు రావాలని ఆదేశాలు జారీ చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఆమె సమర్పించిన పలు ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి అంశంపై దర్యాప్తు జరుగుతోంది.