Lawrence Bishnoi Brother : లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అరెస్ట్
అమెరికాలో అరెస్ట్ చేసిన పోలీసులు.. భారత్ కు రావడంపై కొనసాగుతున్న ఉత్కంఠ
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోసారి మార్మోగింది. ఈ క్రమంలో కీలక పరిణామం సంభవించింది. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ను అమెరికాలోని కాలిఫోర్నియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడు. మరిన్ని హింసాత్మక నేరాలలో ప్రమేయం ఉన్నందున అన్మోల్ బిష్ణోయ్పై రెండు వారాల క్రితం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ అరెస్టును ధృవీకరించగా.. ముంబై, ఢిల్లీ పోలీసులు మాత్రం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సిద్ధూ హత్య అనంతరం నకిలీ పాస్పోర్ట్తో భారతదేశం నుండి పారిపోయిన బిష్ణోయ్ కెనడా(లో ఆశ్రయం పొందినట్లు భావిస్తున్నారు.కొన్ని నెలల క్రితం బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్పై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ముంబైలో సంచలనం సృష్టించిన బాబా సిద్దిఖీ హత్య కేసు నిందితులతో ఇతడు టచ్లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అన్మోల్ను భారత్కు రప్పించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ ప్రత్యేక న్యాయస్థానంలో ముంబయి పోలీసులు ఇటీవల పిటిషన్ వేశారు. లారెన్స్ తరఫున అన్మోల్ పలు చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగమయ్యాడని అందులో పేర్కొన్నారు. దీంతో అతడిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఈ క్రమంలోనే అన్మోల్ కదలికల గురించి అమెరికా అధికారులు ముంబయి పోలీసులను అలెర్ట్ చేయగా.. తాజాగా కాలిఫోర్నియాలో అతడు అరెస్టు అయినట్లు సమాచారం.
హిట్ లిస్ట్ లో ఆ నిందితుడు కూడా
శ్రద్ధా వాకర్ మర్డర్ యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. 2022, మే 18న శ్రద్ధా వాకర్ ప్రియుడు అప్తాబ్ పునావాలా ప్రియురాలిని అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం రంపంతో మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఇంట్లోని ఫ్రిజ్లో దాచిపెట్టాడు. శరీర భాగాలను ఒక్కొటి చొప్పున దగ్గర్లోని అటవీ ప్రాంతంలో పడేవేశాడు. శ్రద్ధా వాకర్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. పోలీసులే ఖంగుతినే విషయాలు వెల్లడి అయ్యాయి. శ్రద్ధా వాకర్ను ఆమె ప్రియుడు అప్తాబ్ ఫునావాలా అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో 2022, నవంబర్ 12న అఫ్తాబ్ పునావాలాను పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం అఫ్తాబ్ పునావాలా తీహార్ జైలులో ఉన్నాడు. ఈ క్రమంలో అఫ్తాబ్ పునావాలాను హత్య చేయాలని కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నింది. దీంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ వర్గాల సమాచారంతో తీహార్ జైల్లో అఫ్తాబ్కు భద్రత పెంచినట్లు తెలిసింది.
భారత్ వస్తాడా
తొలుత అమెరికా పోలీసులు అన్మోల్ను విచారించిన తర్వాత ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులకు అప్పగించే అవకాశం ఉందని ముంబై క్రైమ్బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. తర్వాతే భారత్కు అన్మోల్ను అప్పగిస్తారని ముంబై పోలీసులు భావిస్తున్నారు. గతేడాది తన అన్న గ్యాంగ్స్టర్ లారెన్స్బిష్ణోయ్ అరెస్టయిన తర్వాత అన్మోల్ భారత్ వదిలి అమెరికా పారిపోయాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటనతో పాటు పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలా హత్య సహా పలు కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు.